సీఎం జగన్కు సుప్రీంలో భారీ ఊరట... ఆ పిటిషన్ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డేపై రాసిన లేఖకు సంబంధించిన పిటీషన్.. మరోసారి విచారణకు వచ్చింది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ న్యాయమూర్తికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి లేఖ రాయడం, దాన్ని బహిరంగ పర్చడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ అడ్వొకేట్ చేసిన వాదనలను సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దాన్ని తోసిపుచ్చింది. దానికి సంబంధించిన పిటీషన్ను కొట్టివేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం: జగన్ సర్కార్కు అనుకూలంగా సుప్రీం: సస్పెన్షన్కు ఓకే
రెండు పిటీషన్లు దాఖలు.. వాడివేడిగా విచారణ..
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌల్.. ఈ పిటీషన్పై విచారణ చేపట్టారు. ప్రముఖ న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ వేర్వేరుగా తమ వాదనలను వినిపించారు. దేశంలోనే అత్యంత సీనియర్ న్యాయమూర్తుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఎన్వీ రమణపై వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడం న్యాయవ్యవస్థకు విరుద్ధమని అన్నారు. ఆ లేఖను బహిరంగ పర్చడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. రాజ్యంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి.. అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఇది సమర్థనీయం కాదని, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఏం చెప్పదలచుకున్నారు?
దీనికి న్యాయమూర్తి జస్టిస్ కౌల్ బదులిస్తూ.. ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ను ఎత్తేసిన తరువాత.. ప్రత్యేకంగా రెండో పిటీషన్ను ఎందుకు దాఖలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జీఎస్ మణి వాదనలతో తాను ఏకీభవించలేనని, అసలు ఏం చెప్పదలచుకున్నారని ఆయన న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు. గందరగోళంగా ఉన్న ఇలాంటి పిటీషన్లను విచారించలేమని స్పష్టం చేశారు. దీనికి జీఎస్ మణి రాజ్యాంగంలోని ఆర్టికల్ 121ను ప్రస్తావించారు. అదే సమయంలో రెండో పిటీషన్ తరఫున అడ్వొకేట్ ముక్తి సింగ్ తన వాదనలను వినిపించారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలి బాధ్యతారాహిత్యంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేసు ప్రస్తావన..
ఈ సందర్భంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేసు ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాసిన లేఖ బహిరంగం కావడం సరికాదని, అది ఆయన బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని ముక్తిసింగ్ చెప్పారు. ఎన్వీ రమణపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సమర్థనీయం కాదని పేర్కొన్నారు. జస్టిస్ కౌల్ జోక్యం చేసుకుంటూ.. గ్యాగ్ ఆర్డర్ను ఎత్తేసిన తరువాత ఈ రెండో పిటీషన్ను ఎందుకు విచారణకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. దీనికి ముక్తిసింగ్ బదులిస్తూ.. తన పిటీషన్తో గ్యాగ్ ఆర్డర్కు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.
బెంచ్కు రెఫర్ చేసిన పరిస్థితిలో..
జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిరంగ పర్చడానికి సంబంధించిన పిటీషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉందని, దీన్ని మరో బెంచ్కు రెఫర్ చేశామని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో రెండో పిటీషన్ దాఖలు చేయడం ఏ మాత్రం అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఆ పిటీషన్పై వాదనలను కొనసాగించలేమని తేల్చి చెప్పారు. దాన్ని కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా దాఖలైన రెండో పిటీషన్ పూర్తిగా అన్యమనస్కంగా ఫైల్ చేసినట్లు కనిపిస్తోందని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.
డ్యూయల్ ప్రేయర్..
వైఎస్ జగన్పై సీబీఐ ద్వారా లేదా హైకోర్టు ద్వారా విచారణ జరిపించాలంటూ ఒక పిటీషన్, కో వారంటో కోసం మరో పిటీషన్ను దాఖలు అయ్యాయని కౌల్ చెప్పారు. ఇందులో తొలి పిటీషన్కు సంబంధించిన విచారణను ఇప్పటికే ఒక బెంచ్కు రెఫర్ అయిందని పేర్కొన్నారు. రెండో పిటీషన్లో తాను చెప్పదలచుకున్న విషయాన్ని న్యాయవాది తేల్చుకోలేకపోతున్నారని చెప్పారు. న్యాయవాది కొంత గందరగోళానికి గురైనట్లు కనిపిస్తోందని కౌల్ అన్నారు. ఒక కేసు మీద ఎన్ని పిటీషన్లు వేస్తారని ప్రశ్నించారు.