రాజధానిగా అమరావతిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు - ఏపీ హైకోర్టు ఆదేశాలపై..!!
అమరావతి/న్యూఢిల్లీ: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వాటిపై వాదోపవాదాలను ఆలకించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని అభిప్రాయపడింది ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించింది.

ఆరు నెలల్లో అభివృద్ధి చేయడంపై..
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సమక్షానికి వచ్చింది ఈ పిటీషన్. ప్రభుత్వం, పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. ఆరు నెలల్లోగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..
దీనికి ప్రతిగా అమరావతి రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటీషన్లను దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు అయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయా పిటీషన్లన్నింటినీ క్రోడీకరించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వాదోవాదాలను ఆలకించింది. ఈ సందర్భంగా పలు అంశాలు విచారణకు వచ్చాయి. అభివృద్ధి ఎలా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది.

మధ్యంతర స్టే..
ఆరు నెలల్లోగా రాజధానిని అభివృద్ధి చేయడం సాధ్యమేనా? అని వ్యాఖ్యానించింది. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం. మధ్యంతర స్టే ఇవ్వడాన్ని పిటీషనర్ల తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ వ్యతిరేకించారు. ఈ పిటీషన్లపై వాదనలను వచ్చే వారానికి వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను ధర్మాసనం స్వీకరించలేదు. జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు ఎలా ఆదేశించగలుగుతుంది?
రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని, ఆరు నెలల్లోగా దాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఎలా ఆదేశించగలుగుతుందని కేకే వేణుగోపాల్ అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుందని గుర్తు చేశారు. రద్దు చేసిన ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని, హైకోర్టు మాత్రం అంశాల వారీగా ఆదేశాలను ఇచ్చినట్లు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. హైకోర్టు తనకు లేని అధికారాన్ని ప్రయోగించినట్టయిందని పేర్కొన్నారు.

మూడు రాజధానుల్లో ఒకటి..
అమరావతిని రాజధానిగా తొలగించట్లేదని కేకే వేణుగోపాల్ వివరించారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షిస్తోందని చెప్పారు. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు రాజధానిని మార్చుకునే అవకాశం ఉందా? లేదా? లేక హైకోర్టు ఆదేశించినట్లుగా ప్రభుత్వాలకు పరిమిత అధికారాలు ఉన్నాయా? అనేది స్పష్టం చేయాలని కోరారు. వాదోపవాదాలను విన్న తరువాత బెంచ్.. ఈ మధ్యంతర స్టేను మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications