స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అపర్ణ భర్త వెంకట సత్య భాస్కర్ ప్రసాద్ కు బెయిల్ పై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల స్థానంలో సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం వీటిని జారీచేసింది.
అపర్ణ గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో సీమెన్స్ ప్రతినిధిగా ఉన్న ఆమె భర్త సత్యభాస్కర్ ప్రసాద్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారనే కారణంతో సీఐడీ అతణ్ని నిందితుడిగా చేర్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. అయితే రిమాండ్ కు ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరిస్తూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేశారు.

ఈ నిర్ణయాన్ని సీఐడీ సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దుచేయడంతో ప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే న్యాయమూర్తి వాటిని కొట్టివేయడంతో సవాల్ చేస్తూ ప్రసాద్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
కేసు దర్యాప్తునకు సహకరించాలని సత్య భాస్కర్ ప్రసాద్కు షరతు విధిస్తూ విచారణను వాయిదా వేసింది. ఆ తర్వాత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ధర్మాసనం అంతకుముందు ఇచ్చిన ముందస్తు బెయిల్ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. సోమవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తులు అన్ని విషయాలను పరిశీలించి మధ్యంతర ఉత్తర్వుల స్థానంలో పూర్తిస్థాయి ఉత్తర్వులను జారీచేశారు.












Click it and Unblock the Notifications