తెలంగాణ పన్నుపై ఏపీ ట్రావెల్స్కు షాక్: ఏపీలో ఐఏఎస్Xసమాచార కమిషనర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్స్ పన్ను విషయంలో ఏపీ వాహనదారులకు షాక్ తగిలింది. ఏపీ ప్రయివేటు ట్రావెల్స్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది.
తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడం సరికాదని వారు సుప్రీం కోర్టును ఇటీవల ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికే హైకోర్టు ముందు ఉన్న నేపథ్యంలో త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీం కోర్టు హైకోర్టును ఆదేశించింది. అదే సమయంలో పన్నులు వసూలు చేయకుంటే యంత్రాంగం ఎలా నడుస్తుందని ప్రశ్నించింది.
ఐఏఎస్లపై గవర్నర్కు సమాచార కమిషనర్ల ఫిర్యాదు
ఏపీలో సమాచార కమిషనర్లు, ఐఏఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇచ్చేందుకు పలువురు ఐఏఎస్ అధికారులు నిరాకరిస్తున్నారని సమాచార కమిషనర్లు గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు కుమ్మక్కై తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
రైతులు అంగీకరించకుంటే భూసేకరణ: కలెక్టర్
గన్నవరం విమానాశ్రయం విస్తరణపై రైతులు, అధికారులతో కృష్ణా జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. తమ భూములకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని రైతులు కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. తాను ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. రైతులు భూసమీకరణకు అంగీకరించకపోతే భూసేకరణ తప్పదని చెప్పారు. విమానాశ్రయం విస్తరణకు సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ రేట్లను ఇస్తామని కలెక్టర్ చెప్పారని తెలుస్తోంది.