కొత్త రాష్ట్రంలో సమస్యలెన్నో, రోజా గోల ఏమిటి, ఇద్దరిదీ తప్పే: బాబుకు సుప్రీం
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పైన గురువారం నాడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోజా సభలో వ్యవహరించిన తీరుకు క్షమాపణలు చెబుతూ స్పీకర్కు లేఖ రాయాలని సూచించింది. శాసన సభకు సర్వాధికారాలు ఉంటాయని తెలిపింది.
అదే సమయంలో ప్రభుత్వానికి కూడా చురకలు అంటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సస్పెన్షన్ల గోల ఏమిటని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికార, విపక్షాల తీరును సుప్రీం తప్పుబట్టింది.
ఏపీకి రాజధాని లేక, సరిపడే నిధులు లేక, వనరులు లేక రాష్ట్రం ఇబ్బందులు పడుతోందని సుప్రీం వ్యాఖ్యానించిందని తెలుస్తోంది. రోజా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వచ్చారని, రాష్ట్ర అభివృద్ధికి మీరంతా సహకరించుకోవాలని, రాద్ధాంతం కూడదని హితవు పలికింది. అనుభవలేమి, అపార్థాల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిపింది.

రోజా పరుష వ్యాఖ్యలు తొలి తప్పుగా భావించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటువంటి కేసుల వల్ల శాసన వ్యవస్థకు, కోర్టులకూ ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడింది. ఈ కేసుల విషయంలో మధ్యేమార్గంగా బేషజాలకు పోకుండా పరిష్కరించుకోవాలని హితవు పలికిది.
రోజా కమిటీకి క్షమాపణలు చెప్పి, తనకు నోటీసులు ఇచ్చిన మూడు కమిటీలకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది. అసెంబ్లీ వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. రోజా క్షమాపణలను పరిగణలోకి తీసుకొని కేసుకు స్వస్తీ చెప్పాలని సూచించింది.
ఈ మేరకు రోజా తరఫు న్యాయవాది, అసెంబ్లీ తరఫు న్యాయవాదులు సమావేశమై చర్చించుకోవాలని చెప్పింది. వీరి మధ్య సయోధ్య కుదరకుంటే పూర్తి వాదనలు విని తామే పరిష్కరిస్తామని చెప్పింది. కాగా, రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ లంచ్కు ముందు రెండున్నర గంటలు, ఆ తర్వాత గంటన్నర.. మొత్తం నాలుగు గంటల పాటు వాదనలు వినిపించారు.












Click it and Unblock the Notifications