ఏపి ప్రభుత్వం ఐదేళ్లు ఉండదు!: స్వరూపానంద
హైదరాబాద్: భగవంతుడి ఆశీస్సులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉండదని, పడిపోతుందని విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. ప్రజలను సుఖశాంతులతో పాలించాలన్న ఆలోచన ఉంటే ప్రభుత్వం.. ఆధ్మాత్మిక కార్యక్రమాల నిర్వహణపై పీఠాధిపతులు, మఠాధిపతులు, పండితులు, అర్చకులు, ఆచార్యులతో చర్చించి ఉండేదన్నారు.
ఆదివారం ఆయన ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో స్వరూపానంద స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు, శ్రీరామ నవమి వేడుకల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతానికి మంచి జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఓట్లేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారని గుర్తుచేశారు.

ఇది ఐదేళ్ల ఉద్యోగమే తప్ప శాశ్వతం కాదని హెచ్చరించారు. పుష్కరాల నిర్వహణ కేవలం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ దుర్నీతికి, దుర్మార్గానికి నిదర్శనమన్నారు. ఏపీ సర్కార్.. మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో నిర్ణయం తీసుకోవడం దేశానికి అరిష్టమన్నారు.
గోదావరి నదీ తీరాన ఉన్న మార్కండేయ స్వామి ఆలయం కూల్చివేతకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా దుర్నీతిలో వ్యవహరించలేదన్నారు. ఈ ఆలయాన్ని మెరుగు పర్చాలని చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కూల్చవద్దని డిమాండ్చేస్తున్నారని ఆయన వివరించారు.
కడప జిల్లా ఒంటిమిట్టలో ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా ఏకపక్షమేనన్నారు.
హిందూ పీఠాధిపతులను సంప్రదించనే లేదన్నారు. శాశ్వతంగా జరిగే శ్రీరామచంద్రుడి కల్యాణానికి తాత్కాలిక అవసరాలకు నిర్ణయం తీసుకుని.. ఆరు రోజుల తర్వాత జరిపిస్తామని ఆ ఆలయ పండితులు చెబితే దానికి సర్కార్ తల ఊపడం సరికాదని స్వరూపానంద అన్నారు. చాలా మంది సాధువులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంపై కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందని స్వరూపానంద స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications