ఒక జగన్..: శైలజానాథ్పై ఊగిపోయిన రేవంత్, 'దొర'పైనా
సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పిన శైలజానాథ్ పలుమార్లు దొర, పటేల్, పట్వారీ, దేశ్ముఖ్ పేర్లను ప్రస్తావించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి ఆవేశంగా స్పందించారు. శైలజానాథ్ బిల్లు పైన తన అభిప్రాయం చెబితే అభ్యంతరం లేదని కానీ, తెలంగాణ ప్రజానికాన్ని అవమానించేలా అభిప్రాయం చెప్పి దానిని కేంద్రంపై రుద్దే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అభిప్రాయం చెప్పమంటే ఆయన కేంద్రం పంపించిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ఒక సత్యం, ఒక వైయస్ జగన్, ఒక గాలి, ఒక కోలా, ఒక కృషి వెంకటేశ్వర రావు వంటి వేలు, లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ వారంతా సీమాంధ్రులే అన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకెళ్లారని అభిప్రాయపడ్డారు. ఎయిర్ పోర్టు కోసం ఐదు వేల మంది సామాన్య రైతుల పొట్ట గొట్టారన్నారు.
ఇక్కడి ఆస్తులు అమ్మి సీమాంధ్రలో ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. నిత్యం దొరల గురించి మాట్లాడుతున్న శైలజానాథ్.. అక్కడ నక్సలైట్లు ఎలా వచ్చారో చెప్పాలన్నారు. స్వాతంత్రం గురించి మాట్లాడే మంత్రి పులివెందులలో, తాడిపత్రిల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఏపాటి స్వాతంత్రం ఉందో చెప్పాలన్నారు. సమైక్యభావం గురించి చెప్పే హక్కు మాత్రమే ఉందని, తెలంగాణను అవమానించే హక్కు మాత్రం లేదన్నారు.
కెటిఆర్ ధ్వజం
తెలంగాణ నేతలను తాము సంస్కరించామని, మేం రాకముందు అనాగరికులమని శైలజానాథ్ మాట్లాడటం విడ్డూరమని కెటిఆర్ అన్నారు. సీమాంధ్రలో ఛాంపియనస్ ట్రోఫీలో భాగంగానే నాలుగు ఓట్ల కోసమే వారు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అన్ని విధాలుగా చర్చ జరిగాక కేంద్రం తెలంగాణ ముసాయిదా బిల్లును పంపించిందన్నారు. రేవంత్ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే వారు సంయమనం మాట్లాడాలని కోరుతున్నానని చెప్పారు.
దొర వ్యాఖ్యలపై దామోదర్ రెడ్డి
శైలజానాథ్ పలుమార్లు దొరలు అంటుండటంతో కాంగ్రెసు నేత దామోదర రెడ్డ స్పందించారు. ఓ సామాజిక వర్గంలో పుట్టడం ఎవరి తప్పు కాదని, తాను దొరల కుటుంబంలో పుట్టానని, తనను దొర అంటున్నా తాను ఎప్పుడు అలా భావించలేదన్నారు. శైలజానాథ్ పదే పదే దొరలు అనడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
హీటెక్కింటిన ఎర్రబెల్లి వ్యాఖ్యలు
శైలజానాథ్ మాట్లాడుతుండగా... తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు కల్పించుకొని ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాక సమైక్యవాదంపై మాట్లాడాలన్నారు. ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై శైలజానాథ్ స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలు అహంకారానికి పరాకాష్ఠ అన్నారు. ఎవరి భాష వారిదని ఎద్దేవా చేశారు. తాను మంత్రిని అంటూ శైలజానాథ్ కుండబద్దలు కొట్టారు.
తెరాస అభ్యంతరం, ఈటెల ఆగ్రహం
బిల్లు తెలంగాణ సాయుధ పోరాటానికి వ్యతిరేకమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని శైలజానాథ్ అనడంపై తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపింది. నాడు వెట్టి చాకిరికి, దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందని, మంత్రి దానిని తప్పుదారి పట్టిస్తున్నారని, పదే పదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం అనడం కూడా సరికాదని, కేంద్రానికి చట్టం తెలియనట్లు మాట్లడం సబబు కాదన్నారు. 2004లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. మంత్రి జానా రెడ్డి ఓ సమయంలో ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
బాధ్యతారాహిత్యం: అశోక్ గజపతి రాజు
మంత్రులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నేత అశోక గజపతి రాజు అన్నారు. అసెంబ్లీ అభిప్రాయం అంటే మెజార్టీ అభిప్రాయమేనని చెప్పారు.
ఢిల్లీలో చెప్పాల్సింది: రావుల
శైలజానాథ్ బిల్లును వ్యతిరేకిస్తుండటంపై టిటిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి స్పందిస్తూ... ఢిల్లీలో చెప్పాల్సింది మంత్రిగారు ఇక్కడ చెబుతున్నారని, ఆయన తీరు చూస్తుంటే కంది చేనులో వెతకాల్సింది ఎక్కడో వెతికినట్లుగా ఉందన్నారు. పిసిసి అధ్యక్షులు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారని, మంత్రులుగా వారికి మాట్లాడే హక్కు లేదని, శాసన సభ్యులుగా మాట్లాడవచ్చునన్నారు.
సభ వాయిదా
కాగా శాసన సభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడిన తర్వాత సభాపతి శాసన సభను శనివారానికి వాయిదా వేశారు.