తాడేపల్లి గ్యాంగ్ రేప్ : రైల్వే ట్రాక్పై కనిపించిన నిందితుడు... అంతలోనే మాయం...
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఒకరు బుధవారం(జూన్ 23) తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్ద కనిపించినట్లు తెలుస్తోంది. స్థానికులు నిందితుడిని గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయినట్లు సమాచారం. అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఎక్కి అతను పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తాడేపల్లి రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి నిందితుడి కోసం విస్తృతంగా గాలించారు.
అత్యాచార ఘటన జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా ఇంతవరకూ నిందితులు పట్టుబడలేదు. నిందితుల కోసం గుంటూరు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎక్కడి నుంచి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 19న సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ నివాసానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. బాధిత యువతి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవలే ఆమెకు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో శనివారం(జూన్ 19) రాత్రి విధులు ముగించుకొని కాబోయే భర్తతో కలిసి సీతానగరం పుష్కరఘాట్ వద్దకు వెళ్లింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. పుష్కరఘాట్ వద్ద ఈ ఇద్దరు ఏకాంతంగా ఉండటం గమనించిన ఇద్దరు దుండగలు వారిపై వెనుక నుంచి దాడి చేశారు.
అనంతరం ఆమెకు కాబోయే భర్త కాళ్లు,చేతులు కట్టేసి... ఆమెపై అత్యాతారం చేశారు. యువకుడు ఎదురు తిరగకుండా అతన్ని బ్లేడుతో బెదిరించారు. అత్యాచారం అనంతరం అనంతరం బాధితురాలి చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని ఓ నాటుపడవలో అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితులు స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు.
సీతానగరంకు చెందిన కృష్ణ, వెంకటేష్ అనే యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణానది ఇసుక తిన్నెలు, పుష్కరఘాట్లలో ఒంటరిగా సంచరించేవారిపై వీరిద్దరు గతంలో దాడులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యువతి, ఆమెకు కాబోయే భర్త దగ్గర లాక్కున్న ఫోన్లను దాస్ అనే వ్యక్తి దగ్గర నిందితులు తాకట్టుపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.