తెలుగుదేశం, జనసేన మధ్య కోల్డ్ వార్?
టీడీపీ, జనసేనలో ఉన్న ఆశావహుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేయడం దాదాపు ఖాయమైనట్లే. ఈ క్రమంలో గూడెం సీటు కోసం రెండు పార్టీల తరఫున ఆశావహులు తీవ్రంగా పోటీపడుతున్నారు. టీడీపీ, జనసేనలో ఉన్న ఆశావహుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పొత్తు పొడిస్తే బరిలో ఎవరు నిలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

విలక్షణమైన తీర్పులకు చిరునామా
విలక్షణమైన తీర్పులకు చిరునామాగా నిలిచే తాడేపల్లి గూడెం నియోజకవర్గ రాజకీయం కూడా విలక్షణంగా ఉంటుంది. గూడెంకు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో 5 పార్టీలు విజయం సాధించాయి. 1999 ఎన్నికల నుంచి వరుసగా తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం, బీజేపీ, వైసీపీ గెలుస్తూ వస్తున్నాయి. టీడీపీ నాలుగుసార్లు విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ రిపీటవుతుందని జనసేన భావిస్తోంది. పొత్తులో భాగంగా తాడేపల్లి గూడెం నియోజకవర్గాన్ని కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుతోంది.

గత ఎన్నికల్లో జనసేనకు 36వేల ఓట్లు
గత ఎన్నికల్లో ఆ పార్టీకి 36వేల ఓట్లు వచ్చాయి. అభ్యర్థిగా పోటీచేసిన బొలిశెట్టి శ్రీనివాస్ మూడోస్థానంలో నిలవగా, టీడీపీ తరఫున పోటీచేసిన ఈలి నానికి 54వేల ఓట్లు వచ్చాయి. ఓటమి తర్వాత ఈలి నాని పార్టీ కార్యక్రమాలకు దూరం జరుగుతూ వచ్చారు. దీంతో వలవల బాబ్జీని పార్టీ ఇన్ ఛార్జిగా నియమించింది. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే విజయం ఖాయమని అంచనా వేస్తున్నారు.

కలిసి పోటీచేయడం ఖాయం
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీచేయడంతో బీజేపీ తరఫున పోటీచేసిన పైడికొండల మాణిక్యాలరావు విజయం సాధించి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో వలవల బాబ్జీ, బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీకి దక్కించుకోవాలని బాబ్జీ, జనసేనకు దక్కించుకోవాలని బొలిశెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరుపార్టీల్లో ఏదో ఒక పార్టీ పోటీచేయాల్సి వస్తోంది. కానీ సీటు దక్కనివారు సహకరిస్తారా? అనే సందేహం ఇప్పుడు అందరినీ తొలిచేస్తోంది.

టీడీపీకన్నా యాక్టివ్ గా జనసేన
గత ఎన్నికల్లో బొలిశెట్టి ఓటమిపాలవడంవల్ల ఈసారి ఎన్నికలకు ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కన్నా చురుగ్గా ఆయన పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పొత్తులో ఎవరు పోటీచేస్తారు? ఎవరు త్యాగం చేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తాడేపల్లి గూడేన్ని రెవెన్యూ డివిజన్ గా, పోలీస్ సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయడంతోపాటు ఫార్మసీ కళాశాల ప్రారంభించి ఎడ్యుకేషనల్ హబ్ గా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించిన కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వైసీపీ కూడా ఇక్కడ పట్టు బిగిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తే ఎవరు విజయం సాధిస్తారు? అనే ఉత్కంఠ మాత్రం నియోజకవర్గంలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications