నారా లోకేష్ అనంతపురం టూర్: జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్కు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. ఎయిడెడ్ కళాశాలు, పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడానికి నిరసనగా ఆయన ఇవ్వాళ అనంతపురానికి వచ్చారు. బాధిత విద్యార్థులతో సమావేశం అయ్యారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈ పర్యటనలో ఆయన వెంట ఉన్నారు.
మాజీమంత్రులు జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరామ్ సహా పలువురు నాయకులు నారా లోకేష్ను కలిశారు. ఆయనతో పాటు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్ఎస్బీఎన్ విద్యార్థులతో వారందరూ సమావేశం అయ్యారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ దీన్ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తాడిపత్రి నుంచి బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్లోని ఓ కారు కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది. మితిమీరిన వేగంతో టోల్ ప్లాజా వైపునకు దూసుకొచ్చిన కారు.. అక్కడ అదుపు తప్పింది. రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అద్దాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు గాయపడ్డారు.
అనంతపురం వెళుతున్న నారా లోకేష్ కు మార్గమధ్యలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా..ఈ సందర్బంగా నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ నా మీదనే 11 కేసులు పెట్టారు. ఏ పీకుతారు...రేపు అధికారం లోకి రాగానే వారి సంగతి చూస్తా...అంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. pic.twitter.com/oEGm6KON4W
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 10, 2021
ఈ ఉదయం తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురానికి బయలుదేరారు. మార్గమధ్యలో గుత్తి జాతీయ రహదారి నుంచి అనంతపురానికి వెళ్లే దారిలో ఉన్న కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది. రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మెను ఢీ కొట్టింది. కారు ముందుసీట్లో కూర్చున్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. పగిలిన అద్దం ముక్కలు ఆయన ముఖాన్ని గాయపరిచాయి.
కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులో డ్రైవర్ సహా నలుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ముందు సీట్లో కూర్చున్న కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. వెనుక సీట్లో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్లో వారిని పరామర్శించారు. నారా లోకేష్ పర్యటన కావడం వల్ల ఆయన నేరుగా అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. నిరసన దీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications