పరకాల ఎవరు: తలసాని?, రేవంత్కు చుక్కెదురు: సిట్ కార్యాలయంలోనే
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన ఆడియో టేపులోని మాటలు చంద్రబాబు నాయుడివి కావని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఆధారాలను బయట పెట్టాలని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సీఎం పదవికి రాజీనామా చేసి నిప్పులాంటి వాడని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు జైలుకెళ్తారా? అని మంత్రులు ఎదురు చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆడియో టేపుల సంభాషణల్లో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుందని, ప్రభుత్వం జోక్యం చేసుకోదని తెలిపారు.

ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ని సోమవారం రాత్రి కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. సిట్ కార్యాలయంలో సరైన సౌకర్యాలు లేవని, ఆయన్ని చర్లపల్లి జైలుకు తరలించాలని రేవంత్ తరుపున న్యాయవాదులు చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.
రేవంత్ రెడ్డికి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. సిట్ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సరైన వసతులు కల్పించలేదని ఆయన తరఫు న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని సిట్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా చెప్పారు. సిట్ కార్యాలయంలో రేవంత్ రెడ్డికి భోజనం, మినరల్ వాటర్, కొత్త బెడ్ షీట్లు, బెడ్లు ఏర్పాటుచేశామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications