పట్టణాల్లో ప్రతి ఇంటికీ కుళాయి...పేదలకు రూ.200కే కనెక్షన్!
Recommended Video
అమరావతి:కుళాయి కనెక్షన్లకు సంబంధించి ఎపి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్ జారీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో అక్టోబరు 2 వ తేదీలోగా 6 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
పైగా ఇందులో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉండేవారికి కేవలం రూ. 200 కే కుళాయి కనెక్షన్ మంజూరు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మధ్య తరగతి ప్రజలు కూడా కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఆర్థిక భారం పడకుండా నిర్ణీత మొత్తాన్ని వాయిదాల పద్దతిలో చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో అక్టోబరు 2 వ తేదీలోగా 6 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
పట్టణాల్లో...ప్రతిఇంటికి కుళాయి
రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే పేదలకు ఈ కనెక్షన్ భారం కాకుండా బీపీఎల్ వార్షిక ఆస్తి పన్ను రూ.500 లోపు చెల్లిస్తున్న కుటుంబాలకు రూ.200కే కుళాయి కనెక్షన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న మధ్య తరగతి కుటుంబాలు కూడా కనెక్షన్ కోసం అయ్యే ఖర్చుని ఎనిమిది వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 110 పట్టణాల్లో 24.50 లక్షలకుపైగా ఇళ్లు ఉండగా వాటిలో 13.50 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి.
ఖర్చు ఇది...వెసులుబాటు ఇలా
నిజానికి నేడు ఒక కుళాయి కొత్త కనెక్షన్ కోసం పరికరాలైతేనేమి, ఇతరత్రా రుసుంలు,ఖర్చులైతేనేమి కనీసం రూ.5 వేలు నుంచి గరిష్ఠంగా రూ.7 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో దీని కోసం రూ.10 వేలుకుపైగా వెచ్చిస్తున్నారు. కానీ వార్షిక ఆస్తి పన్ను రూ.500 లోపు చెల్లించే కుటుంబాలు కేవలం రూ.200 చెల్తిస్తే మిగతా మొత్తాలను పురపాలక సంఘాలే ఖర్చు చేసేలా సరికొత్త ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇక రూ.500 కంటే ఎక్కువ ఆస్తి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు ఇందుకోసం అయ్యే ఖర్చును ఎనిమిది వాయిదాల్లో 4 ఏళ్లలో చెల్లించేలాగా సదవకాశం కల్పిస్తున్నారు.
ఇకమీదట...తిరస్కరించరు
కొత్త కుళాయి కనెక్షన్ కావాలని ధరఖాస్తు చేసుకున్నా ఆస్తి పన్ను బకాయిలుంటే ఆ అప్లికేషన్ ను తిరస్కరించే పరిస్థితి ఇప్పటిదాకా అమలులో ఉంది. అలాగే కనెక్షన్ ఇవ్వాలనుకుంటే డొనేషన్తోపాటు ఇళ్ల వరకు పైపులైన్లు, తవ్వకాలు, ఇతరత్రా పనుల కోసం ఇంజినీర్లు వేసిన అంచనాల మేరకు వినియోగదారులే మొదట డబ్బు చెల్లించాల్సి ఉంది. అలాగే ఇంటి యజమాని తరఫున అద్దెకు ఉంటున్న కుటుంబాలు కుళాయి కోసం దరఖాస్తు చేస్తే అనుమతించేవారు కాదు. అయితే ఇకమీదట ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిస్తూ ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అభ్యంతరాలతో సంబంధం లేకుండా అవకాశం ఉన్న మేర ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ జారీ చేయాలని పురపాలక, నగరపాలక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలిసింది.
కనెక్షన్ ఇలా...పర్యవేక్షణ అలా
మున్సిపల్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి కేటాయించిన వార్డుల్లో ఇళ్లకు వెళ్లి కుళాయి కనెక్షన్ ఉందో, లేదో గుర్తించాలి. కనెక్షన్ లేని ఇళ్లకు కుళాయి మంజూరు అయ్యేలా దరఖాస్తులు తీసుకోవాలి. ఇలా వచ్చే మూడు నెలల్లోగా గుర్తించిన అన్ని ఇళ్లకు, అపార్ట్మెంట్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ నిర్ణయించింది. కుళాయి కనెక్షన్ల జారీపై పర్యవేక్షణ కోసం జీఐఎస్లో ఇప్పటికే అన్ని పట్టణాలను మ్యాపింగ్ చేసినందున ఈ వ్యవస్థను దానికి అనుసంధానం చేయనున్నారు. అలాగే వార్డుల వారీగా వేసిన పైపులైన్లు, వీటిలో ఇప్పటికే ఉన్న కుళాయి కనెక్షన్లు, కొత్తగా ఇస్తే వాటి వివరాలు తెలిసేలా సాంకేతికతను ఉపయోగించనున్నారు.