తన జీవితంపై సినిమా తీయనున్న తారా చౌదరి, ఆ లాభాలతో
హైదరాబాద్: తారా చౌదరి సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు జరిగిన అన్యాయం పైన త్వరలో సినిమా తీస్తానని ఆమె వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రముఖ తెలుగు ఛానల్ సాక్షితో మాట్లాడారు.
సినిమా కథకు కసరత్తు జరుగుతోందని, సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా తానే చేపడతానని ఆమె చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో సినిమా తీస్తున్నట్లు చెప్పారు. త్వరలో భారీ బడ్జెట్ సినిమాను తీసి, తర్వాత తన జీవిత కథ ఆధారంగా మరో సినిమా ఉంటుందని చెప్పారు.
కాగా, కొన్నేళ్ల క్రితం తారా చౌదరి అనూహ్యంగా వివాదాలతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె వివాదం కారణంగా రాజకీయాల్లో కూడా కలకలం రేగింది.
ఇటీవల కూడా మరోసారి ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాదులోని ఇందిరానగర్లో గల ఆమె నివాసంలో శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. తారా చౌదరి ఇంట్లో పనిచేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సందీప్, రాజేష్, ఉదయ్ అనే ముగ్గురు యువకులు దాడి చేశారు.
దీంతో దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు సందీప్తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.
అయితే దుర్గాప్రసాద్ మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తారాచౌదరి తమకు ఫోన్ చేయడం వల్లే ఆమె నివాసానికి వెళ్లామని సందీప్ చెప్పాడు. అప్పటికే పూర్తి మద్యంలో ఉన్న దుర్గాప్రసాద్ తమపైనే దాడికి యత్నించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు పోటాపోటీగా ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.