కేబినెట్ విస్తరణ-జనంలోకి జగన్ : ప్రశాంత్ కిషోర్ రీ ఎంట్రీ - టార్గెట్ 2024 లక్ష్యంగా కీలక నిర్ణయాలు..!!
రాజకీయ వ్యూహకర్త ప్రకాశ్ కిషోర్ ఇప్పుడు మరలా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో వచ్చే ఏడాది నుంచి పీకే టీం రంగంలోకి వస్తుందని.. పార్టీ కోసం పని చేస్తుందని స్పష్టం చేసారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతున్నారా అనే చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత జాతీయ రాజకీయా ల్లో ప్రశాంత్ కిషోర్ బీజీగా కనిపించారు. శరద్ పవార్ తో కలిసి జాతీయ పార్టీల కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేసారు.
ఐ ప్యాక్ నుంచి పీకే సేవలు తిరిగి ప్రారంభం
అదే సమయంలో కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ కు ఆహ్వానం అందింది. రాహుల్ గాంధీ..ప్రియాంకతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. సోనియాతోనూ చర్చించారు. అయితే, ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరిక పైన ముఖ్య నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో.. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయం ఉపసంహిరించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాహుల్ పైన కీలక వ్యాఖ్యలు చేస్తూ..ప్రియాంకకు మద్దతుగా మాట్లాడారు. ఈ పరిణామాలోత బెంగాల్ ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయటం లేదని ప్రకటించారు.
ఏపీలో వైసీపీకి తిరిగి వ్యూహకర్తగా..
కానీ, మారిన పరిస్థితుల్లో ఆయన తిరిగి ఐ ప్యాక్ నిర్వహణకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక, త్వరలో జరగునున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రకాంత్ కిషోర్ ఏ పార్టీకి అనుకూలంగా పని చేయటం పైన ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఏపీలో వైసీపీకి మాత్రం పని చేయటానికి స్వయంగా రంగంలోకి వస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయ వ్యూహకర్తగా నాడు జగన్ పాదయాత్ర మొదలు..సమీకరణాలు..ప్రచార తీరు పైన సూచనలు చేసేవారు.
కేబినెట్ విస్తరణ..జగన్ యాత్రలపై చర్చలు
తన టీంతో క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటూ..జగన్ తో చర్చలు..తీసుకోవాల్సిన నిర్ణయాల పైన చర్చించే వారు. ఇప్పుడు పీకే కు చెందిన ఐ ప్యాక్ టీం వైసీపీకి సేవలు అందిస్తోంది. మంత్రులు- ఎమ్మెల్యేల పని తీరు పైన క్షేత్ర స్థాయిలో సర్వేలు చేస్తోందని సమాచారం. ఇప్పటికే వాటికి సంబంధించి సీఎంకు నివేదికలు సైతం సమర్పించారని పార్టీలో చర్చ సాగుతోంది. అయితే, టీడీపీ సైతం 2024 ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం..ఒక విధంగా వచ్చే ఎన్నికలు అటు వైసీపీ..టీడీపీ కి , అదే విధంగా సీఎం జగన్..చంద్రబాబు కు వ్యక్తిగతంగా జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి.
టీడీపీ - వైసీపీకి 2024 కీలకంగా..
రెండు పార్టీల భవిష్యత్ ఈ ఎన్నికల మీదే ఆధార పడ్డాయి. దీంతో..వచ్చే ఎన్నికల కోసం జగన్ ముందుగానే సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగానే పీకే టీం గురించి ఓపెన్ గా సంకేతాలు ఇచ్చేసారు. దీంతో..ప్రశాంత్ కిషోర్ నవంబర్ లో సీఎం జగన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గాన్ని పూర్తి మార్చేయాలని జగన్ నిర్ణయించారు. కేబినెట్ విస్తరణ పూర్తవుతూనే... డిసెంబర్ నుంచి జనంలోకి వెళ్లాలని రచ్చబండ ద్వారా పధకాల సమీక్ష..పార్టీ సమావేశాలు నిర్ణయించారు. వీటన్నింటి పైన ప్రశాంత్ కిషోర్ సైతం సీఎం జగన్ కు సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షర్మిల సైతం పీకే టీం వ్యూహాలతోనే ముందుకు
2024 ఎన్నికల టార్గెట్ లో భాగంగా ఈ నిర్ణయాలు తొలుత అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి..ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్ సోదరి షర్మిల సైతం ప్రశాంత్ కిషోర్ తన పార్టీ కోసం పని చేస్తానని హామీ ఇచ్చారని గతంలోనే వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో ఆయన టీంకు చెందిన సభ్యులు కొందరు షర్మిలతో మంతనాలు సాగించారు. ప్రస్తుతం వారే షర్మిలతో పాటుగా పాదయాత్రలో పాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది.
టార్గెట్ - 2024 రూట్ మ్యాప్ పైన చర్చలు
అయితే, ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్షంగా షర్మిల టీం కు ఎంత వరకు స్ట్రాటజిస్ట్ గా సహకరిస్తారనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. కేంద్రం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఏపీలో మాత్రం జగన్ కు సహకారం అందించటానికి సిద్దమయ్యారు. దీంతో..వచ్చే నెల మొదటి వారంలో జగన్ తో ప్రశాంత్ కిషోర్ సమావేశం సమయంలో రానున్న ఎన్నికలకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ పైన ప్రాధమికంగా చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.