ఎన్టీఆర్భవనెక్కిన కార్యకర్తలు, ఊరుకోం: కెసిఆర్పై డిఎస్
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పైకి కొందరు చీరాల టిడిపి కార్యకర్తలు ఎక్కి హంగామా చేశారు. చీరాల శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ను పార్టీలోకి చేర్చవద్దని నిరసిస్తూ వారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కారు.
కెసిఆర్పై డిఎస్
తెరాస ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాము ఊరుకునేది లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత డి శ్రీనివాస్ వేరుగా అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడంతో తెరాసకు ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు.
తెలంగాణ వాదాన్ని తెరాస క్లైమ్ చేసుకోవడంలో విజయం సాధించిందన్నారు. తెలంగాణ ఇచ్చింది ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అయినప్పటికీ దానిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు. హామీలు నెరవేర్చడంలో కెసిఆర్ విఫలమైతే ఊరుకోబోమన్నారు.
డిగ్గీ, జైరాంలతో భేటీ
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. ఎపి నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవి, పళ్లం రాజు, జెడి శీలం, తెలంగాణ నేతలు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ భేటీలో పాల్గొన్నారు.