130 స్థానాల్లో టిడిపి దే గెలుపు : లాండ్ స్లైడ్ విక్టరీ మాదే : బాబు - జగన్ ధీమాలో ఎవరిది నిజం..!
ఏపిలో పోలింగ్ ముగిసింది. ప్రచారం ఏ స్థాయిలో నిర్వహించారో..పోలింగ్ రోజు అదే తరహాలో పోటీ పడ్డారు. ఇక, కీలక మైన పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత సైతం గెలుపు పై ధీమా వ్యక్తం చేయటంలోనూ వెనుకడుగు వేయటం లేదు. వైసిపి లాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ చెబుతుంటే..టిడిపి 130 పైగా సీట్లలో గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తు న్నారు. దీంతో..ఇప్పుడు విశ్లేషకులు పోలింగ్ సరళి విశ్లేషణలో నిమగ్నమయ్యారు.
జగన్ నమ్మకం ఏంటంటే..
ఏపిలో పోలింగ్ ముగిసిన తరువాత జగన్ మీడియా ముందుకు వచ్చారు. టిడిపి అధినేత చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా..ఓటర్లు సహనంతో ఓటింగ్ లో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కాకపోవటం తో ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉందని విశ్లేషించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ కు తరలి రావటం తమకు అనుకూలించే అంశంగా వివరించారు. దీంతో..తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని..వైసిపి లాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుం దని ధీమా వ్యక్తం చేసారు. ఏపిలో తమకు దక్కే గెలుపు ప్రజా విజయం గా జగన్ అభిర్ణించారు.
టిడిపికి 130 సీట్లు ఖాయం..
ఒక వైపు అర్దరాత్రి వరకు అనేక చోట్ల పోలింగ్ కొనసాగింది. ఆర్దరాత్రి తరువాత టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నేత లతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. అందులో ప్రజలు తిరిగి టిడిపికే పట్టం కట్టారని విశ్లేషించారు. ప్రభుత్వం మీద నమ్మకంతో ఓటర్లు పోలింగ్ కోసం బారులు తీరారన్నారు. మహిళలు..వృద్దులు మరో సారి టిడిపి కే పట్టం కట్టారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అర్ధరాత్రి వరకూ పోలింగ్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న ఏజెంట్లకు ఆయన అభినందనలు తెలిపారు. కౌంటింగ్ వరకూ ఇదే పోరాట పటిమ కొనసాగించి అప్రమత్తంగా ఉండాలని, దశలవారీగా స్ర్టాంగ్ రూముల వద్ద కాపలా కాయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు పాల్పడిందన్న చంద్రబాబు... ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు టీడీపీ పక్షాన నిలిచారని విశ్లేషించారు.
ధీమా సరే..గెలుపెవరిది..
ఎన్నికల్లో హోరా హోరీ తలపడిన రెండు ప్రధాన పార్టీల అధినేతలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోలింగ్ సరళి పై మాత్రం రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.ఇంత పెద్ద మొత్తంలో పోలింగ్ జరగటం.. ప్రధానంగా మహిళలు భారీ స్థాయిలో ఓటింగ్ లో పాల్గొనటం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇది ప్రభుత్వ పాజిటివ్ ఓటా లేక వ్యతిరేక ఓటా అనే కోణం లో చర్చ సాగుతోంది. అదే సమయంలో పసుపు - కుంకుమ, పెన్షన్ల పెంపు ఎఫెక్ట్ ఓటర్ల మీద ఉందని టిడిపి నేతలు చెబుతుంటే..తమను మోసం చేసారని..వైసిపి ఇచ్చిన డ్వాక్రా రుణ మాఫీ హామీ తో వారు జగన్ వైపు మొగ్గు చూపారని..ఇలా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతూ ప్రచారం చేసిన పవన్ మాత్రం పోలింగ్ సరళి పై స్పందించలేదు.