సీబీఐ అరెస్టులపై టీడీపీ వర్సెస్ వైసీపీ-పవన్ మౌనం..!
ఏపీలో నాలుగు నెలల క్రితం తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. అయితే తాము కల్తీ నెయ్యి తిరుమల లడ్డూకు వాడలేదని, కల్తీని గుర్తించి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. చివరికి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో దర్యాప్తుకు సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ ఇప్పుడు నలుగురిని అరెస్టు చేసింది.
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన నలుగురిని సీబీఐ తాజాగా అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో తాము చెప్పిందే నిజమైందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించి తేనె తుట్టె కదిపారు. అప్పట్లో తాను ఈ విషయం చెబితే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు సీబీఐ అరెస్టులతో అదే నిజమని తేలిందంటూ మంత్రులతో వ్యాఖ్యానించారు. తమకు అనుకూలమైన కొందరికి జగన్ అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని, ఇప్పుడు సీబీఐ అరెస్టులపై జగన్ ఏం సమాధానం చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

అయితే చంద్రబాబు కామెంట్స్ కు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తాము వెనక్కి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్ల విషయంలో సీబీఐ అరెస్టులు చేస్తే చంద్రబాబు తన మాటలు నిజమయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18 సార్లు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే.. తమ ప్రభుత్వంలో 18 ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు అంబటి రాంబాబు తెలిపారు.లడ్డూ కల్తీ అయినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదని, కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని అరెస్టు చేసిందని, చంద్రబాబు అబద్ధాలు చెప్పి ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయారన్నారు. మరోవైపు అప్పట్లో తిరుమల లడ్డూ వ్యవహారంపై రచ్చ రచ్చ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి మౌనంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications