కోకాపేట భూములకు ఆ ధరలు జగన్ వల్లే .. కేసీఆర్ పై జగన్ కు ఎనలేని ప్రేమ ఉందన్న టీడీపీ అనిత !!
టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కోకాపేట భూముల అమ్మకం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు వచ్చిన విషయం తెలిసిందే. కోకాపేట్ లోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించి, తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన విషయం పై వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ భూముల అమ్మకం ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయి అంటే అందుకు కారణం సీఎం జగనేనని అనిత ఆరోపణలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమలను సీఎం జగన్ తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారని, అందువల్లే అక్కడ భూములకు ధరలు పెరుగుతున్నాయని అనిత మండిపడ్డారు. గతంలో లేని విధంగా తెలంగాణలో భూముల ధరలు మూడింతలు పెరిగాయి అని అనిత ఆరోపణలు గుప్పించారు.

పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎనలేని ప్రేమాభిమానాలు ఉన్నాయని అనిత దుయ్యబట్టారు. గత ఎన్నికల సమయంలో కెసిఆర్ సొమ్ము ఇచ్చి సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతగా జగన్ ఈ రకంగా మేలు చేస్తున్నారని వంగలపూడి అనిత అభిప్రాయపడ్డారు. ఇక ఇదే సమయంలో అనిత జగన్ మోహన్ రెడ్డి ప్రజలు అడిగిన ఒక్క ఛాన్స్ రాష్ట్రాన్ని దోచుకోవడానికి అని ప్రజలకు అర్థం కావడానికి రెండు ఏళ్ళు పట్టిందని అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా పతనానికి చేరుకుంటుందని అనిత అభిప్రాయపడ్డారు. ఆదివాసీ గిరిజనుల మన్యాలను కూడా వదలకుండా ఖనిజ సంపదను దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆయన బంధువర్గం జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అనిత విమర్శలు గుప్పించారు. అటవీ పరిరక్షణ చట్టాలను తుంగలో తొక్కుతున్నారని అడ్డగోలుగా ఖనిజ సంపదను దోచుకుంటున్నారని విమర్శించారు వంగలపూడి అనిత.












Click it and Unblock the Notifications