టీడీపీ బిగ్ స్కెచ్: బద్వేలులో పోటీ చేయకపోయినా: వైసీపీ ఓటుబ్యాంకును దెబ్బకొట్టేలా ప్లాన్
అమరావతి: కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన నిర్వహించబోయే ఉప ఎన్నికలో పోటీ చేయట్లేదని ప్రకటించిన తరువాత.. తెలుగుదేశం పార్టీ గేరు మార్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా.. అధికార పార్టీ ఓటుబ్యాంకును ప్రభావితం చేసేలా ఈ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసింది. దాన్ని తక్షణమే అమలులోకి పెట్టింది.

నెలాఖరు వరకు
రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ జనంలోకి తీసుకెళ్లనుంది. ట్రూఅప్ ఛార్జీల పేరుతో జగన్ సర్కార్ విద్యుత్ వినియోగదారులపై అదనపు ఛార్జీల భారాన్ని మోపిందంటూ ఆరోపిస్తోంది. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 30వ తేదీన బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. 31వ తేదీ వరకూ ఈ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి సమాయాత్తమైంది.

రూ.36,102 కోట్ల భారం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో అదనపు విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రభుత్వం 36,102 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ఆరుసార్లు ఛార్జీల పెంపు..
జగన్ సర్కార్ ఈ రెండున్నరేళ్ల కాలంలో ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం హయాంలో ఒక్కసారిగా కూడా వాటిని పెంచాలేదని గుర్తు చేశారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కూడా విద్యుత్ ఛార్జీల భారాన్ని జగన్ సర్కార్ జనంపై మోపిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగుదేశం ఈ నెల 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు తెలుగుదేశం పోరాటం సాగిస్తామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి, మంత్రుల దుబారా
అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా జగన్ సర్కార్ ఇప్పటికి 11,611 కోట్ల రూపాయల భారాన్ని మోపిందని అచ్చెన్నాయుడు విమర్శించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 24,491 కోట్ల రూపాయల మేర అప్పులు చేశారని అన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మడమ తిప్పారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలల అవినీతి, దుబారాకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఎదురైందని విమర్శించారు.

కరోనా కాలంలోనూ పన్నులా
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యవసరాల పన్ను, పెట్రోల్, డీజిల్, నిత్యవసరాల ధరలు, విద్యుత్ ఛార్జీలను పెంచిందని ధ్వజమెత్తారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నా అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాడు బిగిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గుతున్నా వినియోగదారులపై భారం మోపడం మాత్రం ఆగడట్లేదని అన్నారు.

బద్వేలు ఉప ఎన్నికపై
బద్వేలు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టకూడదని టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడం ద్వారా అధికార వైసీపీ ఓటుబ్యాంకును కొంత వరకైనా ప్రభావితం చేయాలనేది టీడీపీ వ్యూహంగా భావిస్తున్నారు. అందుకే- ఉప ఎన్నిక జరిగే నెలలోనే రాష్ట్రవ్యాప్తగా నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications