ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసం - కోనసీమలో ఘటనలో ఉన్నది వాళ్లే : అచ్చెన్న ఫైర్..!!
అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం స్పాన్సర్ చేసిందే అమలాపురం విధ్వంసమంటూ వ్యాఖ్యానించారు. కోనసీమలో జరిగిన ఘటనలో ఉన్నది వైసీపీ వాళ్లేనంటూ ఆరోపించారు. విధ్వంసంలో అన్నెం సాయి పాల్గొన్నారని..ఆయన వైసీపీ కార్యకర్త కాదా అంటూ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నా అమలాపురం స్టేషన్ కు హౌస్ ఆఫీసర్ లేరని చెప్పుకొచ్చారు. అక్కడ పోలీసులు అధికారులను నియమించలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యం
మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యం కాదా అంటూ నిలదీసారు. విధ్వంసకారులు వస్తారని ముందే తెలుసని.. అందుకే మంత్రి, ఎమ్మెల్యేను అక్కడి నుంచి ముందుగా తప్పించారంటూ ఆరోపించారు. తునిలో ట్రైన్ను తగులబెట్టింది వైసీపీ నాయకత్వం కాదా అంటూ అచ్చెన్న నిలదీసారు. కోడికత్తి డ్రామా ఆడింది ఎవరని ప్రశ్నించారు. వైఎస్సార్ మృతిపై రిలయన్స్ షాపులను తగలబెట్టింది ఎవరంటూ నాటి అంశాలను ప్రస్తావించారు.

పక్కదారి పట్టించేందుకే అల్లర్లు
శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమలాపురంలో 144 సెక్షన్ ఉంటే అంతమంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఏదో వివాదాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం జగన్కు అలవాటంటూ అచ్చెన్న చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుతో వైసీపీకి చెడ్డపేరు వచ్చిందని..జగన్ను అందరూ తిడుతున్నారని చెబుతూ..పన్నులు, ధరలు పెంపుపై ప్రజలు భగ్గుమంటున్నారని వివరించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే అమలాపురం అల్లర్లు చేయించారని ఆరోపించారు. వైసీపీని ప్రజలు మరిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

కోనసీమను విధ్వంసం చేసేందుకే
జిల్లాల విభజనలో ప్రభుత్వం విఫలం చెందిందని.. జిల్లాల ఏర్పాటు సమయంలో అఖిలపక్షాన్ని సంప్రదించారా అంటూ నిలదీసారు. వీరే సమస్యలు సృస్టించి ఇతర పార్టీలపై నెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కులాలు, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ అచ్చెన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications