మున్సిపాలిటీల్లో ఖాతా తెరిచిన టీడీపీ-తాడిపత్రి కైవసం-జేసీ ప్రభాకర్రెడ్డి గెలుపు
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఏలూరు మినహా 11 కార్పోరేషన్లతో పాటు 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో అత్యధిక చోట్ల వైసీపీ ఘన విజయాలు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. అయితే ఇంత హవాలోనూ విపక్ష టీడీపీ ఖాతా తెరిచింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం టీడీపీ విజయం సాధించింది.
ఏపీ మున్సిపల్ పోరులో టీడీపీ ఖాతా తెరిచింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో వైసీపీతో పోలిస్తే పూర్తిగా వెనుకబడిన టీడీపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం జయకేతనం ఎగురవేసింది. గతంలో తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి మున్సిపాలిటీ పోరులో బరిలోకి దిగి విజయం సాధించారు. అంతే కాదు టీడీపీని కూడా విజయపథంలో నడిపారు. ఇక్కడ 36 వార్డుల్లో టీడీపీ 19 వార్డుల్ని కైవసం చేసుకుంది. వైసీపీ 11 వార్డులకు పరిమితమైంది. సీపీఐకి ఒకటి దక్కింది.
అలాగే సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని మైదుకూరు మున్సిపాలిటీలోనూ వైసీపీ వెనుకబడింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు. మైదుకూరులో 24 వార్డులు ఉండగా..టీడీపీ 12 వార్డుల్ని గెల్చుకుంది. వైసీపీకి 11 వార్డులు దక్కాయి. మరో డివిజన్లో జనసేన గెలుపొందింది. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లను కూడా కలుపుకుంటే టీడీపీకి ఛైర్మన్ పీఠం దక్కడం కష్టమే అని చెప్పవచ్చు. స్ధానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఓట్లను కూడా కలుపుకుంటే వైసీపీకే మేయర్ పీఠం దక్కనుంది.