ఇదీ లెక్క: పేరు లేదు కానీ జగన్-పవన్ కళ్యాణ్కు తగిలేలా చెప్పారు
అమరావతి: ఏపీకి ప్రత్యేక ఇవ్వనని బిజెపి తేల్చి చెప్పింది. హోదాను మించిన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెబుతోందని టిడిపి చేతులు దులుపేసుకుంది. ఈ నేపథ్యంలో వైసిపి, జనసేనలు ప్రత్యేక హోదా కోసం ఇంకా గళమెత్తుతున్నాయి. బిజెపి, టిడిపిలను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
శుక్రవారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమరావతి పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఇద్దరు కేంద్రమంత్రులు కలిసి పవన్, జగన్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరి పేరు పెట్టకుండా వారు హోదా వంటి ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు.
వారు ఎక్కడ కూడా పవన్ పేరు లేదా జగన్ పేరును ఉపయోగించలేదు. కానీ వారికి తగిలేలా మాట్లాడారు. అదే సమయంలో ఏపీకి హోదానే కావాలని, ప్యాకేజీతో ఒరిగేదేమీ లేదని చెప్పిన పవన్, జగన్లకు కూడా ఏం ఇచ్చామో లెక్కలతో సహా వివరించారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తిరుపతి, కాకినాడలలో ప్రత్యేక హోదా కోసం సభలను నిర్వహించారు. నవంబర్ 10న అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, వెంకయ్య, జైట్లీలు ఏపీకి చేసిన, చేస్తున్న అంశాలను మరోసారి చెప్పారు.
- అమరావతిలో మెట్రో రైలు ఏర్పాటు చేసి, దానిని గన్నవరం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామన్నారు. రూ.64వేల కోట్ల వ్యయంతో జాతీయ రహదారులను అమరావతికి అనుసంధానం చేస్తామన్నారు.
- ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్లే 90;10 నిష్పత్తిలో రావాల్సిన నిధులు ఇస్తామన్నారు.
- చంద్రబాబును ఒంటరిగా వదిలేయకుండా, సహకరిస్తామని చెప్పారు.
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చుతామన్నారు.
- ఏపీకి ఐదేళ్ల కాలంలో రూ.2.03 లక్షల కోట్లు ఇస్తామని జైట్లీ చెప్పారు. గత 58 ఏళ్లలో ఏర్పాటు చేయని ఎన్నో ప్రతిష్ఠాత్మక వర్శిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
- పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా సహకరిస్తామన్నారు.
- రాజధానిలో రూ.1000 కోట్లతో 7 ప్రధాన రోడ్లు నిర్మిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
- ఏపీని ఆదుకునే క్రమంలో చెప్పని వాటిని కూడా చేస్తామని చెప్పారు.
- 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయంలో ఏపీకి రూ.98వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, మోడీ అయిదేళ్ల హయాంలో అంతకు రెండు రెట్లు ఇస్తామన్నారు.
- రైతులు తమ భూములను అమ్ముకుంటే వారికి పడే కేపిటల్ గెయిన్ ట్యాక్స్ విషయాన్ని పలువురు ప్రశ్నించారని, దానికి వీలైనంత త్వరలో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
- ఏపీ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందేందుకు అందరం కలిసి ప్రయత్నిద్దామని జైట్లీ సూచించడం గమనార్హం.












Click it and Unblock the Notifications