రాష్ట్రంలో సమస్యలను వదిలేసి సినిమాటికెట్లపై పడ్డారు; ఆ కమీషన్లు రాకే జగన్ ఇలా: బుద్దా వెంకన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మరోమారు మాటల యుద్ధానికి తెర తీశాయి. తాజాగా హీరో నాని సినిమా టికెట్ల ధరలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఎంతో మంది కార్మికులు ఆధారపడ్డ సినిమా థియేటర్ ల కంటే వాటి పక్కన ఉన్న కిరాణా షాపుల వాళ్ళ సంపాదన ఎక్కువగా ఉంటుందంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ రగడకు కారణమయ్యాయి. నాని చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ తదితర ఏపీ మంత్రులు ఇప్పటికే నానికి కౌంటర్ వేస్తుంటే, నాని చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టిడిపి నేతలు అధికార పార్టీపై విమర్శలకు దిగాయి.
నానీ వ్యాఖ్యలపై స్పందించిన బుద్దా వెంకన్న
హీరో నాని వ్యాఖ్యలపై వంగలపూడి అనిత నానీకి థాంక్స్ అంటూ ఇప్పటికైనా సినీ వర్గాల వారికి నొప్పి తెలిసింది అని తాజా వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలకు మద్దతుగా బుద్ధ వెంకన్న వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా సినిమా టికెట్ల ధరలకు ప్రాధాన్యత ఇస్తున్నారని బుద్ధ వెంకన్న విరుచుకుపడ్డారు. సినీ పరిశ్రమను నాశనం చేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ హీరోలను దెబ్బ తీయటమే జగన్ సర్కార్ లక్ష్యం
సినిమా హీరోలను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోందని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపణలు గుప్పించారు. సినిమా వాళ్ళ నుండి కమిషన్లు రావడం లేదని ప్రభుత్వం సినిమా థియేటర్ లపై దాడులు చేయాలని అధికారులను ప్రేరేపిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మండిపడ్డారు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వారు సీఎం జగన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించిన బుద్ధ వెంకన్న, కావాలని సినీ పరిశ్రమ పై కక్ష కట్టారని మండిపడ్డారు. థియేటర్ల మీదికి అధికారులను దండయాత్రగా పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .ఒక ఛాన్స్ పేరుతో జగన్ ప్రజల జీవితాన్ని తారుమారు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
పెట్రేగిపోతున్న మంత్రుల తాట తీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
విజయనగరంలో అశోక్ గజపతిరాజు పై కేసులు పెట్టడం దుర్మార్గమని వేల ఎకరాలను దానం చేసిన వ్యక్తిని దోచుకున్న వాళ్ళు అవమానిస్తున్నారంటూ బుద్ధ వెంకన్న విరుచుకుపడ్డారు. పెట్రేగిపోతున్న మంత్రుల తాట తీసే రోజులు దగ్గర పడ్డాయి అంటూ బుద్ధ వెంకన్న హెచ్చరికలు జారీ చేశారు . ప్రజలంతా ఏపీ మంత్రులకు బుద్ధి చెప్పాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు . ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని బుద్ధ వెంకన్న అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video
రాజకీయ స్వలాభం కోసమే జగన్ పని చేస్తున్నాడు
ప్రజలు అడిగిన హామీలను తీర్చకుండా రాజకీయ స్వలాభం కోసం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారంటూ బుద్ధ వెంకన్న ఆరోపించారు. సినిమా టికెట్ల అంశమే ఈ ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా మారిందని బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. నానీ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో టీడీపీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.