"షో" చేస్తున్నారా, చంద్రబాబు ఆగ్రహం - యువగళం కుదింపు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. కానీ, పార్టీ నేతల్లో మాత్రం ఆశించిన పనితీరు కనిపించటం లేదు. పార్టీకి అడ్డగా భావించే విజయవాడలో టీడీపీ నేతల తీరు పైన చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. లోకేశ్ యువగళం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వేళ నేతల తీరు కారణంగా మూడు రోజులకే పరిమితం అయింది.
నేతల పని తీరుపై అసహనం
రాష్ట్రంలో ఎక్కడా ఏం జరిగినా విజయవాడ టీడీపీ నేతలు వెంటనే స్పందిస్తారు. వైసీపీ పైన విరుచుకుపడతారు. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల పని తీరు మాత్రం ఆశాజనకంగా లేదు. టీడీపీకి తొలి నుంచి బలమైన ప్రాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో 2019 ఎన్నికల్లో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి.

తిరిగి పట్టు దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తున్న వేళ పార్టీ నేతలు కేవలం ప్రచార ఆర్భాటా లకే పరిమితం అవుతున్నారు. ఎక్కడా క్షేత్ర స్థాయిలో పని చేయటం లేదు. ఎన్నికలు సమీపిస్తున్నా నేతల తీరు మారకపోవటం పైన పార్టీ అధినేత వీరి పైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు (శనివారం) నుంచి కృష్ణా జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది.
కీలక జిల్లాలో లోకేశ్ యాత్ర
జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితుల్లో లోకేశ్ యాత్ర కుదించారు. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో లోకేశ్ యాత్ర కొనసాగనుంది. పెనమలూరు, గన్నవరంలో కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేసారు. ప్రతీ జిల్లాలోనూ పార్టీ శ్రేణులు లోకేశ్ యాత్ర సక్సెస్ చేయటానికి శ్రమించారు. విజయవాడలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
నిత్యం టీవీ చర్చల్లో..ప్రకటనల్లో ముందు నిలబడే పార్టీ నేతలు లోకేశ్ యువగళం యాత్ర నిర్వహణలో వెనుక ఉన్నారు. దీంతో, గన్నవరం లో మాత్రమే లోకేశ్ సభ నిర్వహించనున్నారు. ఆ సభ ఏర్పాట్ల బాధ్యతలను గుంటూరు జిల్లా నేత యరపతినేని శ్రీనివాస రావు కు అప్పగించారు. కీలకమైన జిల్లాలో ఒక్క సభకే లోకేశ్ పరిమితమయ్యారు.

గన్నవరం సభతో సరి
కీలక జిల్లా కావటంతో దాదాపు 15 రోజులు యాత్ర జరిగేలా ముందు చర్చలు జరిగాయి. అనూహ్యంగా ఇప్పుడు లోకేశ్ యాత్ర బాధ్యతలు కేశినేని చిన్ని తీసుకోవటం ఆసక్తి కరంగా మారింది. ఎంపీ కేశినేని నానితో చిన్నికి విభేధాలు ఉన్నాయి. కానీ, వచ్చే ఎన్నికల్లో లోక్ సభ నుంచి చిన్ని బరిలో నిలుస్తారని చెబుతున్నారు.
ఇప్పుడు లోకేశ్ యాత్ర షెడ్యూల్ మొదలు..పార్టీ నేతలతో సమీక్షలు..యాత్ర ఏర్పాట్లను చిన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు లోకేశ్ యాత్ర సమయంలో నేతల తీరు పైన హెచ్చరికలు చేసే అవకాశం కనిపిస్తోంది. యాత్ర సమయంలోనే సీట్ల గురించి స్పష్టత ఇస్తారని అంచనా వేస్తున్నారు. కీలక జిల్లాలో పార్టీ నేతల తీరు పైన నాయకత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications