చంద్రబాబుకు పోటీగా వైసీపీ: నాడు జగన్కు అలా చేసినందుకేనా: ప్రజా వేదిక ఎవరికి దక్కేను..!
ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు. అప్పుడే రాజకీయంగా అధికార - ప్రతిపక్షాల మధ్య ఎత్తులు .. పై ఎత్తులు మొదలయ్యాయి. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఏపీ ముఖ్యమత్రికి లేఖ రాసి తన తొలి అభ్యర్దనను ఆయన దృష్టికి తెచ్చారు. తనకు ప్రజా వేదిక కొనసాగించమని కోరారు. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ సైతం ప్రజా వేదిక తమకు కేటాయించాలంటూ సీఎస్ను కోరింది. అయితే, వైసీపీ నేతలు గతంలో అనుభవాలను గుర్తు చేస్తున్నారు. మరి.. ఇప్పుడు ప్రజా వేదిక ఎవరికి దక్కేను. జగన్ ఏం చేయబోతున్నారు..
చంద్రబాబు వర్సెస్ వైసీపీ..
ఏపీలో అధికార వర్సెస్ ప్రతిపక్షం మధ్య రాజకీయ పోరాటం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఉంటున్న ఇంటికి అనుబంధంగా ప్రజా వేదికను తనకు అధికారికంగా కేటాయించాలని జగన్కు లేఖ రాసారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు సైతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసారు. సచివాలయం..ప్రస్తుతం జగన్ వినియోగిస్తున్న క్యాంపు కార్యాలయం మధ్యలో ఉండే ఈ ప్రజా వేదిక అధికారిక సమీక్షలకు ఉపయోగించుకుంటామని .. అక్కడైతే ట్రాఫిక్ సమస్య కూడా ఉండదని వివరించారు.

దీనిని గతంలో సైతం ముఖ్యమంత్రి వినియోగించుకున్నా రని .. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికే కేటాయించాలని విజ్ఞప్తి చేసారు. దీంతో..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీని పైన ఇంకా ఎటువంఇ నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రితో చర్చంచిన తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నాడు జగన్కు అలా చేసినందుకేనా..
ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు లేఖ రాసిన వెంటనే వైసీపీ నేతలు వేగంగా అడుగులు వేయటానికి గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత ప్రతిపక్ష హోదాలో తనకు విజయవాడ స్వరాజ్ మైదానం ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్ను తనకు కేటాయించాలని నాడు జగన్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే, ప్రభుత్వం మాత్రం అది కేటాయించానికి సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

అదే విధంగా..జగన్కు ప్రతిపక్ష నేత హోదాలో నాడు కేటాయించిన వాహనాల గురించి పార్టీ నేతలు ఫిర్యాదు చేసారు. ఆ వాహనాల స్థానంలో కొత్తవి కేటాయించాలని కోరినా ..ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. ఇలా తమను ఆనాడు ఇబ్బంది పెట్టిన వారికి ఇప్పుడు జగన్ సహకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications