కీలక జిల్లాలో అభ్యర్దులను ఖరారు చేసిన చంద్రబాబు - బరిలో ఐఏఎస్ కుమార్తె..!!
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులను చంద్రబాబు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే జాబితా సిద్దం చేసినా..జగన్ చేస్తున్న ఇంఛార్జ్ ల మార్పుతో అలర్ట్ అవుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేనకు ఇచ్చే సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేల అభ్యర్దులను చంద్రబాబు దాదాపు ఫైనల్ చేసారు.
జాబితా సిద్దం : చంద్రబాబు తన సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభ్యర్దులను దాదాపు ఖరారు చేసారు. జనసేన పొత్తులో భాగంగా ఈ జిల్లాలో రెండు సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉండగా ఇందులో 8సీట్లలో అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబే పోటీ చేయబోతున్నారు. పీలేరులో నల్లారి కిశోర్కుమార్రెడ్డి, పలమనేరు- అమరనాథ్రెడ్డి, పుంగనూరు- రామచంద్రారెడ్డి, నగరిలో- భానుప్రకాశ్, శ్రీకాళహస్తి - సుధీర్రెడ్డి, చంద్రగిరి- పులివర్తి నాని, గంగాధర నెల్లూరు(ఎస్సీ)- డాక్టర్ థామస్, పూతలపట్టు(ఎస్సీ) -మురళీమోహన్ అభ్యర్థిత్వాలు ఖరరయ్యాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గాలపై టీడీపీ నాయకత్వం నిర్ణయానికి రావాల్సి ఉంది.

ఎవరెక్కడ : ఇందులో మదనపల్లె, తిరుపతి స్థానాలను మిత్రపక్షం జనసేనకు కేటాయిస్తారని సమాచారం. చిత్తూరు నుంచి రియల్ వ్యాపారి గురజాల జగన్మోహన్, జడ్పీ మాజీ చైర్మన్ చంద్రప్రకాశ్, మాజీ మేయర్ కఠారి హేమలత, మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడి కుటుంబానికి చెందిన తేజస్విని, శ్రీనివాస్, పార్టీ నేత బాలాజీ, విద్యాసంస్థల నిర్వాహకుడు రాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ నేత షాజహాన్వైపు నాయకత్వం మొగ్గుతోంది. జనసేన కు ఈ సీటు కేటాయించకోతే హాజహాన్ పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్కుమార్రెడ్డి, శంకర్ యాదవ్, పార్టీ నేత సైకం జయచంద్రారెడ్డి పోటీపడుతున్నారు. సత్యవేడు రేసులో మాజీ ఎమ్మెల్యే రత్నవేల్ గాంధీ మేనకోడలు చందన స్రవంతి, రిటైర్డ్ అధికారి పనబాక కృష్ణయ్య పేర్లు రేసులో ఉన్నా..తాజాగా వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

రేసులో మాజీ ఐఏఎస్ కుమార్తె : తిరుపతి ఎంపీ స్థానానికి అంగలకుర్తి నీహారికవైపు టీడీపీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. ఈమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైరైన ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ కుమార్తె. తండ్రి విద్యాసాగర్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారే. నీహారిక కుటుంబం బాపట్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నా టీడీపీ నాయకత్వం తిరుపతిలోనే నిలపాలని భావిస్తోంది. చిత్తూరు ఎంపీ సీటుకు తలారి ఆదిత్య, వెటర్నరీ వైద్యుడు యశ్వంత్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతిలో నీహారికకు అవకాశం వస్తే చిత్తూరులో ఆదిత్యకు ఛాన్స్ లేనట్లే. బంధుత్వమే దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే, బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే ఈ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications