ఎన్నికల వేళ కుప్పంలో చంద్రబాబు కీలక నిర్ణయం..!!
టీడీపీ అధినేత చంద్రబాబ కుప్పం కేంద్రంగా ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైనా కుప్పంలో ఓడిస్తామని వైసీపీ కొంత కాలంగా చెబుతోంది. వై నాట్ పులివెందుల అంటూ టీడీపీ కౌంటర్ ప్రచారం ప్రారంభించింది. కొద్ది కాలం క్రితం కుప్పం లో ఇంటి నిర్మాణానికి చంద్రబాబు నిర్ణయించారు. ఇందు కోసం ఇంటి స్థలం కూడా కొనుగోలు చేసారు. ఇప్పుడు కుప్పంలో అన్న క్యాంటీన్ కోసం చంద్రబాబు కుప్పంలో 20 సెంట్ల స్థలం విరాళంగా ఇచ్చారు.
చంద్రబాబు భూమి విరాళం:కుప్పంలో అన్న క్యాంటీన్ శాశ్వత నిర్మాణం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు భూమిని విరాళంగా అందించారు. కుప్పం టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని కుప్పం మా అన్న క్యాంటీన్ ట్రస్టుకు విరాళంగా చంద్రబాబు అందించినట్లు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వెల్లడించారు. టీడీపీ హయాంలో పేదలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు నిర్వహించామని గుర్తు చేసారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దు చేసిందని వివరించారు. ఇప్పుడు పేదల ఆకలి తీర్చేందుకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అందులో భాగంగా ముందుగా కుప్పంలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చారు.

కుప్పం పై వైసీపీ గురి:వైసీపీ నేతలు కుప్పంలో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. నిర్వహణ లేక ఆ తరువాత మూసివేసారని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో సాగుతున్న అన్న క్యాంటీన్ టీడీపీ అధికారంలో ఉన్నా..లేకున్న కొనసాగుతుందని స్పష్టం చేసారు. దాతత సాయంతో రోజుకు 500 మందికి భోజనం అందిస్తున్నామని వివరించారు. తాజాగా మహానాడు వేదికగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళాలు వచ్చాయని వెల్లడించారు. కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించేందుకు కొంత కాలంగా టీడీపీ వర్సస్ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. స్థానిక సంస్థల్లో గెలుపు తరువాత వైసీపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కుప్పంలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు తరచూ కుప్పంలో పర్యటనలు చేస్తూ పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబు వ్యూహం:ఇప్పటికే కుప్పం వైసీపీ ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ భరత్ కు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల సమీక్షలో భాగంగా భరత్ ను చంద్రబాబు పైన కుప్పం అభ్యర్ధిగా ప్రకటించారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎంపీ మిథున్ రెడ్డి కుప్పం పైన స్పెషల్ ఫోకస్ చేసారు. టీడీపీ నుంచి పలువురిని వైసీపీలోకి తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ను ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులో మంత్రిని ఓడిస్తామంటూ చంద్రబాబు కౌంటర్ సవాల్ చేసారు. దీంతో..ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుప్పం కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. ఈ సమయంలో చంద్రబాబు భూమి విరాళంగా ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications