సీనియర్ల సీట్ల మార్పు, చంద్రబాబు తాజా నిర్ణయం - ఎవరెక్కడ..!!
వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. చంద్రబాబు ప్రతీ అడుగు ఆచి తూచి వేస్తున్నారు. జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్న చంద్రబాబు...బీజేపీతో పొత్తు పైన తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. పొత్తులు ఖాయమైతే సీట్ల పైన తది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలోనే సీనియర్ల సీట్ల మార్పు పైన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి వచ్చే నేతల చేరికల పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
మారుతున్న లెక్కలు : టీడీపీ అభ్యర్దుల ఖరారు మరింత సమయం తీసుకోనుంది. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలిన తర్వాతే స్పష్టత, కదలిక వస్తాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా పొత్తుల పైన కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ తరువాత పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్ల పైన స్పష్టత వస్తుంది. అప్పుడు తీసుకొనే నిర్ణయానికి అనుగుణంగా తమ అభ్యర్దులను ఫైనల్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. బీజేపీ ప్రధానంగా మెజార్టీ ఎంపీ సీట్లను డిమాండ్ చేస్తోంది. బీజేపీకి 6-8 ఎంపీ స్థానాలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ కోరుతున్న స్థానాలు మినహాయించి ఇతర స్థానాల్లో అభ్యర్దుల కసరత్తు పైన చంద్రబాబు ఫోకస్ చేసారు.

సీట్లు మార్పు : నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కూడా వేమిరెడ్డి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఆత్మకూరు విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది. అక్కడ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని నిలపాలని టీడీపీ అధిష్ఠానం భావించింది. కానీ ఆయన తనకు వెంకటగిరి కావాలని అడుగుతున్నారు. తాజాగా ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి.. మూడు నియోజకవర్గాల్లో ఆయన పేరుతో ఫోన్ సర్వే నిర్వహించారు. సర్వేపల్లికి ఆనంను మార్చి.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ఆత్మకూరు పంపాలనే ప్రతిపాదన పైన సర్వే చేయిస్తున్నారు. నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.

పొత్తుల్లో ఎవరెక్కడ : ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ ఖాయమని చెబుతున్నారు. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 22న టీడీపీలో చేరుతున్నారు. ఆయన్ను అదే స్థానంలో అభ్యర్థిగా నిలపాలని నాయకత్వం నిర్ణయించింది. గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ప్రవాసాంధ్ర ప్రముఖుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఖరారయ్యారు. తిరుపతి (ఎస్సీ) లోక్సభ టికెట్ టీడీపీ, బీజేపీల్లో ఏ పార్టీకి కేటాయించినా ఒక కుటుంబంలోని వారే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఈ సీటు నుంచి పోటీ చేస్తే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకుమార్తె నీహారికను నిలపాలని ఆ పార్టీ అధిష్ఠానం గతంలోనే నిర్ణయించింది.












Click it and Unblock the Notifications