ఎన్నికల వేళ చంద్రబాబు కీలక నిర్ణయం - హైదరాబాద్ వేదికగా..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ టీడీపీ అధినేత కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో మరింత వేగంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎన్నికల కార్యాచరణ ప్రకటనకు సిద్దం అవుతున్నారు.సుదీర్ఘ కాలం తరువాత హైదరాబాద్ వేదికగా పార్టీ పొలిట్బ్యూరో భేటీ కానుంది. ఈ నెల 29న పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోనే ఈ వేడుకలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల పార్టీ నేతలు హాజరవుతున్నారు. కీలక ప్రకటనకు చంద్రబాబు సిద్దం అవుతున్నారు.
టీడీపీలో వరుసగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు..ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవటంతో టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలు..భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం కానుంది. రేపు (మంగళవారం) హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సమావేశంలో ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తుల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, ప్రజాసమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ - తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల అంశం పైన వరుసగా జరిగే పొలిట్బ్యూరో ...ప్రతినిధుల సభలో పార్టీ నేతలు తమ అభిప్రాయాలు స్పష్టం చేసే అవకాశం ఉంది. ఏపీలో జనసేనతో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ..తెలంగాణలో వైఖరి పైన స్పష్టత ఇస్తారని అంచనా వేస్తున్నారు. బీజేపీ నేతలు తాము టీడీపీతో కలిసేది లేదని చెబుతున్న వేళ..పార్టీ సమావేశంలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీకి రానున్న ఎన్నికలు కీలకంగా మారాయి. ప్రధానంగా ఏపీలో అధికారం కోసం టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ నెల 29న హైదరాబాద్ లో జరిగే ప్రతినిధుల సభలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలపైన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేళ ఈ ఏడాది మహానాడు కీలకంగా మారుతోంది. గత ఏడాది ఏపీలోని ఒంగోలులో మహానాడు నిర్వహించారు. పార్టీ శ్రేణుల నుంచి భారీ స్పందన కనిపించింది. ఇప్పుడు ఎన్నికల వేళ మరింత జోష్ పెంచేలా మహానాడు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఏపీ వేదికగానే మహానాడు నిర్వహించనున్నారు. ఈ సారి ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ లో ప్రధానంగా విశాఖ లేదా తిరుపతి లో మహానాడు నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి పొలిట్బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా ఏపీలో భవిష్యత్ పొత్తులు..రాజకీయ కార్యాచరణ పైన చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. పార్టీ ప్రతినిధుల సభకు ఏపీ నుంచి పొలిట్బ్యూరో సభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications