వైసీపీపై పోరాటంలో చంద్రబాబు కొత్త వ్యూహం - ఢిల్లీ కేంద్రంగా..!!
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు..శాంతి భద్రతల అంశం పైన పార్లమెంట్ లో ప్రస్తావించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల పైన రాష్ట్రంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా పోరాటానికి నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభ వేళ ..పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేవమయ్యారు. పార్లమెంట్ లో చర్చకు వచ్చే అంశాలు..పార్టీ వైఖరి పైన క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఏపీకి చెందిన అంశాలను ప్రస్తావించాలని సూచించారు. ఈ సమయంలోనే వివాదాస్పదంగా మారి ప్రస్తుతం కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన జీవో నెంబర్ 1 అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని నిర్ధేశించారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి గురించి పార్లమెంట్ లో గళమెత్తాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు.
రేపు (మంగళవారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పార్టీ వ్యూహాల పైన ఎంపీలకు కీలక సూచనలు చేసారు. చంద్రబాబు పాల్గొన్న కందుకూరు..గుంటూరు సభల్లో జరిగిన తొక్కసలాట తరువాత ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దీని ద్వారా రోడ్ల పైన సభలు..రోడ్ షో లపైన నియంత్రణ విధించింది. ఈ వ్యవహారం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. తొలుత హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ జీవో ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సుప్రీం సూచనల మేరకు ఈ పిటీషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించారు. విచారణ సమయంలో పిటీషన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. విచారణ పూర్తయి..ప్రస్తుతం తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో జీవో నెంబర్ 1 పై మాట్లాడాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. రాజ్యంగ హక్కులను ప్రభుత్వం హరిస్తుందనే అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తాలని నిర్దేశించారు.
అదే సమయంలో..పంచాయితీ నిధులను దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుందనే అంశం పైన మాట్లాడాలని సూచించారు. ఎఫ్ఆర్బీఎం పరిమిికి మంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ఆర్దిక వ్యవస్థను భిన్నాభిన్నం చేసేసిందని చంద్రబాబు ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. వీటితో పాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం పైన పార్లమెంట్ లో ప్రస్తావన చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం..రావాల్సిన నిధుల పైన ప్రశ్నించాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు.