వదిలిపెట్టే ప్రసక్తే లేదు - కొడాలి నాని పై చంద్రబాబు ఫైర్..!!
గుడివాడలో చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే..మాజీ మంత్రి కొడాలి నాని పై ఫైర్ అయ్యారు. గుడివాడలో రాజకీయ బిక్ష పెడితే..చరిత్ర హీనులుగా మారారన్నారు. గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కోడికత్తు కేసులో తాను తొలి నుంచి చెబుతున్నదనే జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్ పోయిందని..అరావతిని ముంచేసారని..ప్రత్యేక హోదా ఏమైందని నిలదీసారు. ఏ వ్యాపారం చేసి జగన్ రూ 510 కోట్లు సంపాదించారో చెప్పాలన్నారు. కొడాలి నాని పైన చంద్రబాబు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పై విమర్శలు:గుడివాడ బహిరంగ సభలో చంద్రబాబు సీఎంను టార్గెట్ చేసారు. కోడికత్తి డ్రామా కమల్ హాసన్ డ్రామా అని తాను అప్పుడే చెప్పానని గుర్తు చేసారు. కోడికత్తి డ్రామాలో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేలిందని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. ఒట్ల కోసం సానుభూతి డ్రామాగా అభివర్ణించారు. ఎన్నికల ముందు మెడలు వంచి హోదా తెస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు తాను మెడలు వంచుతున్నారని విమర్శించారు. సీఎంకే అమరావతి అంటే గిట్టదన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెర తీసారని ఫైర్ అయ్యారు. 2004కి ముందు జగన్ ఆదాయం రూ కోటి 70 లక్షలని చెప్పారు. ఈ నాలుగేళ్లల్లో బటన్ నొక్కి 2 లక్షల కోట్లు ఇస్తే..ఆయన మంత్రులు మరో 2 లక్షలు బొక్కేసారని ఆరోపించారు.

బూతుల మంత్రి తిరగ్గలడా:ఎన్టీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గం గుడివాడని చంద్రబాబు గుర్తు చేసారు. అలాంటి చోట ఈ రోజు తులసి వనంలో గంజాయి మొక్కలా స్థానిక ఎమ్మెల్యే తయారయ్యాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆ మొక్కను పెకిలించేద్దామని చెప్పారు. బూతులు మాట్లాడటం గొప్పతనమా అని ప్రశ్నించారు. అవి మాట్లాడటానికి తాను అవసరం లేదని,తమ్ముళ్లను రెచ్చగొడితే ఆ బూతులు వినలేని పిరస్థితి తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఒక్కరూ జెండా పట్టుకుని రోడ్డుపైకి వస్తే ఈ బూతుల మాజీ మంత్రి రోడ్డుపై తిరగగలడా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో సరైన రోడ్డు వేయలేని ఈ ఎమ్మెల్యే కేబరే డాన్సులు తెచ్చారంటూ ఆరోపించారు. పేకాట క్లబ్బులు తెచ్చి బాగా దండుకున్నారని విమర్శించారు. మధ్య తరగతి ప్రజలకు చెందిన ప్లాట్లు కబ్జా చేసారని ఆరోపించారు.
నిమ్మకూరు ప్రజలకు హామీ:ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును తెలుగు జాతి గర్విచే స్థాయిలో తీర్చి దిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబుకు పట్టువస్త్రాలు అంచేసారు. ఈ గ్రామాన్ని లోకేష్ దత్తత తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. భెల్ కంపెనీని ఈ గ్రామంలో ఏర్పాటు చేసామని దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని అయిదు కుటుంబాలను దత్తత తసుకొని వారికి అన్ని రకాలుగా తోడుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 28న రాజమండ్రిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా 100వ కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో చంద్రబాబు కొద్ది సేపు గడిపారు.












Click it and Unblock the Notifications