చంద్రబాబు కీలక ప్రకటన - ముహూర్తం ఫిక్స్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమయ్యారు. ఇందుకు విజయదశమి ముహూర్తంగా ఖరారు చేశారు. పొత్తుల పైన కీలక వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజునే చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై స్పష్టత ఇచ్చారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికలకు సంబంధించి మరో కీలక అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రానున్న విజయదశమి రోజున తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడించారు. పార్టీ మహానాడు వేదిక ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు కొనసాగింపుగా పూర్తిస్థాయిలో హామీలు మేనిఫెస్టోలో పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు. మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించామని, అవసరమైతే మరో సిలిండర్ ఉచితంగా ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలను శక్తివంతులుగా తయారు చేయడమే టిడిపి లక్ష్యమని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే తాను ఆత్మవిశ్వాసం ఇచ్చానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

టిడిపి గెలుస్తుందని మహిళలంతా సంకల్పం తీసుకోవాలని కోరారు. అందరి భవిష్యత్తుకు తనది గ్యారెంటీ అని,మహిళల సమక్షంలోనే పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా 15000 ఇస్తామన్నారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించామని చెప్పారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పి ఫోర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయచ్చని వివరించారు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు అన్నారు. పేదవారికి అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications