మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్గా అశోక్ తొలగింపు
ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో పర్యటించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరో ఘటన జరిగితే ఖబడ్డార్ అంటూ జగన్ సర్కారుకు హెచ్చరికలు చేశారు. విగ్రహాల ధ్వంసంపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాముడిని కాపాడలేని సీఎం ఎందుకు ?
రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, రథాలకు నిప్పు, ఆలయాల ధ్వంసం, పూజారులపై దాడులు జరుగుతుంటే హిందువులు భాదపడరా అని విపక్ష నేత చంద్రబాబు ఇవాళ ప్రశ్నించారు. రామతీర్ఘంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు తన హయాంలో ఏ ఒక్క మసీదు, చర్చిపై అయినా దాడులు జరిగాయా అని జనాన్ని ప్రశ్నించారు. ఇవాళ అయోధ్యలో రామాలయం కడుతుంటే ఉత్తరాంధ్రలో శ్రీరాముడి తల నరకడం ఆమోద యోగ్యమా అని అడిగారు. ఎన్టీఆర్ ఇచ్చింది రామరాజ్యమని, 14 ఏళ్లలో జనం బాధపడకుండా తాను పాలించానని, ఇవాళ రావణుడ్ని చంపిన రాముడి తలతీశారంటే ఈ ముఖ్యమంత్రిని మనిషనాలా, నరరూప రాక్షసుడా అని ప్రశ్నించారు. శ్రీరాముడిని కాపాడలేకపోతే మీరు సీఎంగా ఎందుకని జగన్ను ప్రశ్నించారు.
Recommended Video
జగన్ ఖబడ్డార్.. పులివెందుల రాజకీయాలొద్దు..
రామతీర్ధంకు వస్తుంటే తనకు పోలీసులు అడ్డంకులు కల్పించడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఖబడ్డార్ సీఎం జగన్ .. అందరూ తిరగబడితే పోలీసులు కూడా పారిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. నేను దారిలో వస్తుంటే ఎన్ని విన్యాసాలు చేశారో చూశానని చంద్రబాబు అన్నారు. ఏీ2 విజయసాయిరెడ్డి వస్తే మీరు కాళ్లుమొక్కుతారా అని పోలీసులను ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన జరిగిన 29వ తేదీ నుంచి ఇప్పటివరకూ రాని వారు తాను వస్తున్నానని తెలియగానే పరిగెత్తుకుని వచ్చారన్నారు. తన దగ్గర నాటకాలు ఆడొద్దన్నారు. పులివెందుల రాజకీయాలు చేయొద్దని సీఎంకు చంద్రబాబు సూచించారు. బాబాయ్ని హత్య చేసినా అడగరని అనుకోవడానికి ఇది పులివెందుల కాదన్నారు. రామతీర్ఘం ఘటన తర్వాత విజయనగరం వచ్చిన సీఎం జగన్ ఇక్కడికి మాత్రం రాలేదన్నారు. అలాంటి సీఎంకు బుద్దుందా, సిగ్గుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్ధం ఘటన జరిగాక ఆర్డీవో కానీ ఇతర అధికారులు కానీ ఇక్కడికి రాకపోవడం దారుణమన్నారు. ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కూడా ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లారు కానీ ఇక్కడికి రాలేదన్నారు.
సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
ఓ ఘటన జరిగిందంటే ఓకే, రెండు జరిగాయంటే ఓకే .. కానీ 19 నెలల్లో 127 దేవాలయాలపై దాడులు జరిగాయని చంద్రబాబు తెలిపారు. రామతీర్ధం, రాజమండ్రి, ఆ తర్వాత పాడేరులో గిరిజనులు పూజించే అమ్మవారి విగ్రహం పాదాలు నరికారంటే వీరు ఎంత రాక్షసులో అర్ధం చేసుకోవాలన్నారు. దాతలిచ్చిన దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని సర్కారుపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. దేవుడి ఆస్తుల జొలికొస్తే సీఎం జగన్ మసైపోతారని చంద్రబాబు హెచ్చరించారు. 127 దేవాలయాలపై దాడులు జరిగాయని,, వాటిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు వేశామని ప్రభుత్వం చెప్పుకుందని, కానీ ఇప్పటికీ ఏమీ జరగలేదన్నారు. 2020 అందరికీ పీడకలగా మిలిగిపోయిందని, కానీ 2021లో జోరు పెంచుతామన్నారు. గతంలో పిచ్చోడి చేతికి రాయి ఇచ్చామని, ఇప్పుడు దాని ఫలితాలు అనుభవిస్తున్నామన్నారు. 20 నెలల క్రితం అధికారం ఇస్తే ఇప్పటికీ ఏమీ చేయలేకపోయారన్నారు.
ఇంకొక్కటి జరిగినా వదిలిపెట్టం...
విశాఖలో నన్ను నిలువరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని చంద్రబాబు ఆక్షేపించారు. సీఎం జగన్ విమానంలో వచ్చి సభలు పెడతారని, కానీ నన్ను మాత్రం రామతీర్ధం కూడా రానివ్వరా అని పోలీసులను ప్రశ్నించారు. తాను బాంబులకే భయపడలేదని, తనను కాపాడింది వెంకటేశ్వరస్వామి అని గుర్తుచేశారు. ప్రజల కోసం మావోయిస్టులను ఎదిరిస్తే తనపై 23 క్లైమోర్మైన్స్ పేల్చారని, కానీ వెంకటేశ్వరుడు మాత్రం తనను కాపాడాడన్నారు. తాను రామతీర్ధంలో దేవుడ్ని కాపాడేందుకే వచ్చానన్నారు. మిమ్మల్ని కాపాడే దేవుడ్ని మీరు కాపాడుకుంటారా లేదా అని జనాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. మరో ఘటన జరిగితే తాము వదిలిపెట్టబోమన్నారు.
అధికారంలోకి వచ్చాక అన్నీ సమీక్షిస్తాం...
తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్క కేసునూ సమీక్షిస్తామని, ప్రతీ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రామతీర్ధంలో ఇతరులు వస్తే సాక్ష్యాలు తారుమారు వస్తాయని చెప్పి మూసేసిన అధికారులు, ఏ2 విజయసాయిరెడ్డి వస్తే మాత్రం రెడ్ కార్పెట్ స్వాగతం పలికారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే, వాటిపై సింహాలు ఎత్తుకుపోతుంటే బూతుల మంత్రి ఏమవుతుందని ప్రశ్నించడం దారుణమన్నారు. జగన్ మెడలో క్రాస్ ఉండాలి, లోటస్పాండ్లో క్రాస్ ఉండాలని, బైబిల్ చదవకుండా నిద్రపోనని ఆయనే చెప్పుకున్నారని, ఆయనకేనా, మాకు సెంటిమెంట్లు ఉండవా అని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతిలో డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా సీఎం దర్శనం చేసుకుంటుంటే మా సెంటిమెంట్లు దెబ్బతినవా అని ప్రశ్నించారు. సీఎంగా వెళ్లాను కాబట్టి డిక్లరేషన్ ఇవ్వనని అనడం సరికాదన్నారు.
సభ జరుగుతుండగానే ఛైర్మన్గా అశోక్ తొలగింపు
రామతీర్దంలో చంద్రబాబు పర్యటనకు హాజరైన తర్వాత బహిరంగసభలో ఆయన ఛైర్మన్గా హోదాలో ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సభలో చంద్రబాబు మాన్సాస్తో పాటు ఇతర వ్యవహారాలపైనా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వం రామతీర్ధం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి అశోక్గజపతిరాజును తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి. అయితే దీనిపై సమాచారం లేకపోవడంతో చంద్రబాబు సహా ఇతర నేతలెవరూ స్పందించలేదు. అయితే మాన్సాస్ గురించి మాట్లాడిన చంద్రబాబు... ఛైర్మన్ పదవి నుంచి అశోక్గజపతిరాజును తప్పించి 10 లక్షల కోట్ల ఆస్తుల కబ్జాకు ప్లాన్ చేశారని విమర్శించారు. ఇప్పుడు అశోక్ మీ ముందుకు స్తున్నారని, సంచైత ఎక్కడైనా కనిపిస్తుందా అని ప్రశ్నించారు.