పోలవరం బాధితులకు న్యాయం చేయరా??
పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం తన హామీలన్నీ నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. గోదావరి వరదలపై నాలుగు జిల్లాల్లో తన పర్యటనల అనంతరం అక్కడి ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ సాయం పెంచాలని కోరుతూ సీఎస్ కు లేఖ రాశారు. వరదలు వేల కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయని, ఇళ్లు కూలిపోయి, మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇళ్లల్లోకి తిరిగి వెళ్లలేని దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు.
2014లో హుద్ హుద్, 2018లో తిత్లీ తుపాను సమయంలో టీడీపీ ప్రభుత్వం పరిహారం పెంచి ఇచ్చిందనే విషయాన్ని గుర్తుచేశారు. 8 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ధరలు బాగా పెరిగాయని, అందుకు తగ్గట్లుగా నష్టపరిహారాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలన్నారు.
దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వడంతోపాటు రూ.2.50 లక్షల తో కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.10వేలు, పూర్తిగా దెబ్బతిన్నవాటికి రూ.25వేలు, వరికి ఇన్ పుట్ రాయితీ హెక్టారుకు రూ.25వేలు, ఆక్వా కల్చర్ కు రూ.50వేలు ఇవ్వాలని, మరణించిన వ్యక్తికి రూ.10 లక్షలు నష్టపరిహారం కింద చెల్లించాలని కోరారు. పోలవరం నిర్వాసితులకు దశలవారీగా పరిహారం అనే విధానాన్ని పక్కనపెట్టి అందరికీ పరిహారం ఇవ్వాలన్నారు. పోలవరం కోసం భూములు, ఊళ్లు ఇచ్చి త్యాగం చేసినవారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.