నాడు నెత్తిన ముద్దులు.. నేడు పిడిగుద్దులు : జగన్పై చంద్రబాబు ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరనన్నారు. పన్నులు, ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల అడ్డదారులకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. వారి విచ్చలవిడి తనంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీతోనే లంబాడాలకు గుర్తింపు
తెలుగు రాష్ట్రాల్లో లంబాడాలు అన్ని విధాలుగా వెనుకబడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పాలనలోనే వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. అనేక పదవులు ఇచ్చి వారికి రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు. ఏన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పించారు. అరకు కాఫీకి టీడీపీ ప్రభుత్వమే గుర్తింపు వచ్చేలా చేసిందన్నారు. ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం కూడా చేసామని బాబు గుర్తుచేశారు.
రాష్ట్రంలో చీకటి రాజ్యం
ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ ఆగడాలకు అడ్డులేకుండా పోతుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో గంజాయి సాగు వీపరీతంగా సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ఆనాడే చెప్పానన్నారు. ఇప్పడు అది కల్లారా చూస్తున్నామని విమర్శించారు. జగన్ ఒక్క చాన్స్ చాన్స్ ఇవ్వాలంటూ నెత్తిన ముద్దులు పెట్టారు. ఇప్పడు అదే నెత్తిన పిడిగుద్దులు గుద్దుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క చాన్స్ అని కరెంట్ తీగని ఒక్క సారి ముట్టుంకుంటే ఏమవుతుందో.. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారన్నారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం..
రాష్ట్రాన్ని సీఎం జగన్ అందకారంలోకి నెట్టారని చంద్రబాబు ఆరోపించారు. నమ్మి ఓటేసిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తునారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. రాక్షస పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.