మొండిచేయి,ఇక తాడోపేడో: టిడిపి, జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తి
అమరావతి: బడ్జెట్లో కేంద్రానికి రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నా కేంద్రం నుండి సానుకూలంగా ప్రకటన రాకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఏపీపై సవతి తల్లి ప్రేమను చూపుతున్న బిజెపితో తాడోపేడో తేల్చుకొంటామని టిడిపి ఎంపీలు ప్రకటించారు.మరోవైపు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై ఏపీని న్యాయం చేయాలని అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.ఈ ఆందోళనలను పురస్కరించుకొని కేంద్రం నుండి సానుకూల సంకేతాలు వస్తాయని టిడిపి నేతలు భావించారు.
ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహయం కలుగుతోందని భావించిన టిడిపి ఎంపీలకు నిరాశే ఎదురైంది. మిత్రపక్షంగా ఉన్న తమ డిమాండ్ పట్ల బిజెపి అనుసరిస్తున్న తీరుపై టిడిపి ఎ:పీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అరుణ్ జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తి
రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే టిడిపి ఎంపీలకు చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. జైట్లీ ప్రకటనలో కొత్తదనం లేదని బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని బాబు సూచించారు. నిరసనలను కొనసాగించాలని బాబు పార్టీ ఎంపీలకు సూచించారు.

తాడోపేడో తేల్చుకొంటాం
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుండి సానుకూలమైన సంకేతాలు రాకపోవడంతో టిడిపి ఎంపీలు తీవ్ర నిరాశతో ఉన్నారు. బిజెపి అనుసరిస్తున్న విధానాలతో టిడిపి ఎంపీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బిజెపితో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తమ నిరసనల పట్ల బిజెపి సరిగా వ్యవహరించకపోవడం పట్ల టిడిపి నేతలు మండిపడుతున్నారు. తాడోపేడో తేల్చుకొంటామని టిడిపి ఎంపీలు కొనకళ్ళ నారాయణ, టీజీ వెంకటేష్ ప్రకటించారు. మిత్రధర్మాన్ని కూడ బిజెపి పట్టించుకోవడం లేదని టిడిపి ఎంపీలు అభిప్రాయపడ్డారు.

కేంద్రం మొండిచేయి చూపింది
ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయాలని తాము ఆందోళన చేస్తోంటే కేంద్రం నుండి సానుకూలంగా సంకేతాలు రాలేదని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు తోట నరసింహం కేంద్రం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసినా కేంద్రం నుండి సానుకూలంగా స్పందించలేదన్నారు.

మిత్రపక్షమే, శత్రువులం కాదు
బిజెపితో తాము మిత్రపక్షంగా ఉన్నామని టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు తోట నరసింహం అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సమయంలో ఇతర పార్టీల నేతలు తమకు మద్దతును ప్రకటించిన విషయాన్ని తోట నరసింహం గుర్తు చేశారు. కేంద్రం నుండి హమీలు ఉన్నాయి, కానీ, ఆ మేరకు నిధులు రావడం లేదని నరసింహం గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications