ఎస్ఈసీ నీలం సాహ్నీకి చంద్రబాబు ఫోన్కాల్: ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ డిమాండ్
అమరావతి: రాష్ట్రంలో మినీ ఎన్నికల యుద్ధం నడుస్తోంది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించనుంది ఎస్ఈసీ. మొత్తంగా 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలను ఎదుర్కొంటోన్న మున్సిపాలిటీల్లో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అధికారుల అండతో..
దీన్ని టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పోటాపోటీగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పరిణామాల మధ్య కుప్పంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ తెలుగుదేశం పార్టీ ముందు నుంచీ ఆరోపిస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పం, నెల్లూరు, దర్శి వంటి స్థానాల్లో నియమించుకున్నారని, వారిని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీ నాయకులకు వంతపాడే వారిని విధుల్లో నుంచి తప్పించాలంటూ ఆందోళనలు చేస్తోంది.

ఫోర్జరీ సంతకాలతో..
సకాలంలో అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించట్లేదని, ఫోర్జరీ సంతకాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారనీ ఆరోపిస్తోంది టీడీపీ. క్షేత్రస్థాయిలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించని మున్సిపాలిటీల్లో తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపి వేయాలని చంద్రబాబు..నీలం సాహ్నీకి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి ఫోన్ చేశారు.

క్షేత్రస్థాయిలో అక్రమాలు..
అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, కుప్పం, దర్శి మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, వెంటనే ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపించాలని అన్నారు. క్షేత్రస్థాయి నివేదికను తెప్పించుకుని, వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు. నెల్లూరులో గడువు ముగిసినా ఇంతవరకూ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించట్లేదని చంద్రబాబు అన్నారు. ఇది అప్రజాస్వామ్యం కాదా అని ప్రశ్నించారు.

తుది జాబితా ప్రకటించకుండా..
దీనిపై రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుది జాబితా ప్రకటించకుండా ఏకగ్రీవాలు అయినట్లు ప్రకటించటం పట్ల చంద్రబాబు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని నీలం సాహ్నీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.

నెల్లూరులో ఏకగ్రీవాలు ఎలా సాధ్యం..
అక్రమాలు ఇలాగే కొనసాగితే- ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. నెల్లూరులో గడువు ముగిసినా తుది జాబితా ప్రకటించలేదని, అయినా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ఎలా ప్రకటిస్తారని చంద్రబాబు నిలదీశారు. దినేష్ కుమార్ అనే అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది డివిజన్లు ఏకగ్రీవమని ఏకపక్షంగా ప్రకటించడం ఎలా సాధ్యపడిందని ప్రశ్నించారు.
Recommended Video

ఉద్దేశపూరకంగా తుదిజాబితాలో జాప్యం..
అభ్యర్థుల తుది జాబితా ప్రకటనలో అధికారులు ఉద్దేశపూరకంగా జాప్యం చేశారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను తారుమారు చేయడానికే తుదిజాబితాను ప్రకటించడంలో జాప్యం చేశారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నట్టు నకిలీ పత్రాలను అధికారులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికలు నిలిపివేసి, విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications