ఉంటే ఉండొచ్చు.. వెళితే వెళ్లొచ్చు..!! స్పష్టం చేసిన చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024లో జరిగే ఎన్నికలు అధికార వైసీపీకేకాకా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ తరుణంలో మొహమాటాలకు పోవడంకానీ, చూసీచూడనట్లుగా ఉండే ధోరణిని విడనాడకపోతే పార్టీకి దీర్ఘకాలికంగా నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు కొంతమంది నేతలట్ల కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు.

అధినేతపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి
ఎవరైనా ఒక నాయకుణ్ని దూరం చేసుకోవాలంటే బాబు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. తర్వాత చూద్దాంలే అంటూ దాటవేత ధోరణిలోకి వెళ్లిపోతారు. వారివైపు తప్పులున్నప్పటికీ చూసీ చూడనట్లుగా ఉండేవారు. ఇందుకు ఉదాహరణ.. ఇటీవలి కేశినేని నాని వివాదం. కానీ అటువంటి ధోరణే గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కారణమని, దాన్ని వదిలించుకోకపోతే ఈసారి అధికారంలోకి రావడం కష్టమని తెలుగు తమ్ముళ్లు అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బాబు కూడా తన తీరును మార్చుకోవడమే కాకుండా అధికారంలో లేనప్పుడు చురుగ్గా వ్యవహరించలేకపోతున్న నాయకులను గుర్తించి వారిని పక్కన పెడుతున్నారు.

పార్టీకే మొదటి ప్రాధాన్యం
వారిలో గతంలో తనకు అత్యంత సన్నిహితంగా మెలిగినవారు ఉన్నా.. విడదీయారని అనుబంధం ఉన్నా సరే.. ఇప్పుడు వారివల్ల పార్టీకి నష్టం కలుగుతుందనుకుంటే చాలు.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.. దూరంపెడుతున్నారు. పార్టీకే ప్రథమ ప్రాధాన్యమని వారికి స్పష్టం చేస్తున్నారు. నాయకుడి రెక్కల కష్టం మీద, ప్రజల ఆదరణ మీద గెలుస్తూ వస్తున్న వారే టీడీపీలో ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షంతో లాలూచీ పడే నాయకులను అధిష్టానం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా అటువంటివారితో కేంద్ర కార్యాలయం ఒక జాబితా తయారుచేసింది. ఇటీలే జరిగిన తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో పార్టీకి బలం ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడవడంవల్లే ఓటమి పాలైనట్లు అధిష్టానం భావిస్తోంది. దీనికి కారణమైన వ్యక్తిని పార్టీ నుంచి పక్కకు తప్పించారు.

మంత్రులుగా పనిచేసినవారైనా సరే..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు చేపట్టినవారు ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ఈ తరహా నేతలను చంద్రబాబు ఉపేక్షించడకూడదని నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్రలో కొందరు కీలక నేతలు, సీనియర్ నేతలుగా ఉండి మత్రులుగా పనిచేసినవారికి పదవులు లేవు.. టికెట్లు లేవు.. మీ ఇష్టం అని చెప్పేయబోతోంది. వారి బదులు యువతకు అవకాశం ఇవ్వాలనే యోచనలో బాబు ఉన్నారు. చంద్రబాబు తన విశ్వరూపం చూపిస్తే పార్టీలో ఉండే ఇటువంటి నేతలకు గండం వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications