రానున్న చంద్రబాబు పర్యటలన్నీ ఉద్రిక్తమే?
తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని చెబుతోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు ఇతర సీనియర్ నేతలంతా తమ సమావేశాల్లో అమరావతికి మద్దతు పలకడంతోపాటు దాని ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య రాజధానిపైనే ప్రధాన పోరు నడుస్తోంది. వారి రాజకీయాలన్నీ 'రాజధాని' కేంద్రంగా సాగుతున్నాయి.

కర్నూలులో చంద్రబాబుకు నిరసన సెగ
ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడికి నిరసన సెగ తగిలింది. 'రాయలసీమ ద్రోహి' అంటూ నినాదాలు చేశారు. కర్నూలుకు రాజధాని రాకుండా అడ్డుకుంటున్నారంటూ కొంతమంది అడ్డగించారు. వారంతా ఎవరు? నిజంగా ప్రజలేనా? లేదంటే వైసీపీ ఏర్పాటు చేసినవారా ఆరా తీసి మీడియాకు ఇవ్వాలని అక్కడి నేతలను చంద్రబాబు ఆదేశించారు. రానున్న ఎన్నికలు రాజధాని కేంద్రంగా సాగబోతున్నాయని స్పష్టమవుతోంది. విశాఖ కోసం ఉత్తరాంధ్ర, కర్నూలు కోసం రాయలసీమ ప్రజల్లో భావాద్వేగాలు నెలకొంటే రానున్న రోజుల్లో రాజకీయ వాతావరణం అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య నడవబోతోంది.

రాజధానే రాబోయే ఎన్నికలకు రెఫరెండం?
చంద్రబాబునాయుడు కూడా ప్రస్తుతం జిల్లాల పర్యటన చేస్తున్నారు. కర్నూలులో నిరసన సెగ తగిలినట్లుగానే ఉత్తరాంధ్రలో కూడా నిరసనలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో మున్ముందు చంద్రబాబు చేసే పర్యటనలన్నీ అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరగబోతున్నాయని స్పష్టమవుతోంది. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి మూడు సంవత్సరాలవుతోంది. అయితే న్యాయస్థానాల నుంచి అందుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. కచ్చితంగా రాజధాని అమరావతి, మూడు రాజధానులపై రెఫరెండంగానే వైసీపీ ఎన్నికలకు వెళ్లబోతోందని చెప్పవచ్చు.

ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలి
మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని, కానీ చంద్రబాబునాయుడు రాయలసీమను, ఉత్తరాంధ్రను అభివృద్ధి చెందనీయకుండా అమరావతి కోసం అడ్డుపడుతున్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ప్రజల్లోకి ప్రబలంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రులను, పార్టీ నేతలను ఆదేశించారు. మరోవైపు మూడు రాజధానులనేది అమలయ్యే ప్రతిపాదన కాదని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈ తరుణంలో ఈ రెండు పార్టీల మధ్య నలుగుతున్న అమరావతికి పరిష్కారం ఎవరు చూపిస్తారో?.












Click it and Unblock the Notifications