ఏపీలో ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నాన్ని మింగేసి ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైసీపీ మూకకు వ్యతిరేకంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విశాఖను కొల్లగొట్టి.. కంపెనీలను వెళ్లగొట్టారని, అటువంటివారు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా తెలుగుదేశం నిలబడాలని సూచించారు.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలి
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పార్టీ నేతలంతా ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో సిద్ధంగా ఉండాలని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో గెలుస్తామనే నమ్మకాన్ని స్థానికంగా ఉండే నాయకులే కల్పించాలని, అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలుంటున్నాయని స్పష్టం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి
వైసీపీ పాలనలో రాష్ట్రంలో నష్టపోని వర్గమంటూ లేదని, ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చాలన్నారు. మూడు రాజధానులంటూ ప్రజల్ని జగన్ మోసం చేస్తున్నారని, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇన్ఛార్జిలు గట్టి పనిచేయాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మరోసారి హెచ్చరించారు.

కఠినమైన నిర్ణయాలు తప్పవు
నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, అభ్యర్థులు తామేనని నిరూపించుకోవాలని, లేదంటే కఠినమైన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. బాదుడే బాదుడు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై తెప్పించుకున్న నివేదికల ఆధారంగా పనితీరును బాబు సమీక్షించారు. వెనకబడివున్న అభ్యర్థులు స్పీడు పెంచాలని, అలసత్వం చూపేవారి లెక్కలు తనదగ్గర ఉన్నాయని, తర్వాత మీ ఇష్టమంటూ తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications