ఏపీని కాపాడే బాధ్యత మోడీదే: శివరామకృష్ణన్ కమిటీ ప్రకారమే: 10 వేల కోట్లు ఖర్చు: చంద్రబాబు లేఖ
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఏ ముహూర్తంలో రాజ్భవన్ గడప తొక్కిందో గానీ.. లేఖల మీద లేఖలు గవర్నర్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శాసన మండలిలో సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్కు లేఖ రాశారు. వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దంటూ విజ్ఙప్తి చేశారు. తాజాగా- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లేఖ రాశారు.
అనాలోచిత నిర్ణయాలతో..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం తీసుకుంటోన్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అనాలోచితంగా, ముందుచూపు లేకుండా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోందని, అందులో భాగంగానే.. ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను రూపొదించిందని విమర్శించారు. దీనివల్ల ప్రాంతీయ విభేధాలు తలెత్తుతాయని, రాష్ట్రం అల్లకల్లోలానికి గురి అవుతుందనే ఆందోళనను చంద్రబాబు వ్యక్తం చేశారు.
పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా
కేంద్రం రూపొందించిన, పార్లమెంట్ ఆమోదించిన పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారమే తమ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ను కోల్పోయామని అన్నారు. ఏపీకి రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించిందని, ఆ కమిటీ సూచించిన ప్రకారమే తమ ప్రభుత్వం అమరావతిని గుర్తించిందని అన్నారు. కమిటీ సిఫారసుల ప్రకారం విజయవాడ- గుంటూరు మధ్య ప్రాంతాన్ని కొత్త రాజధాని నగరంగా ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు.
చారిత్రక ప్రాధాన్యత
అమరావతి ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి చారిత్రక, సాంస్కృతిక, ఆర్ధిక, భౌగోళిక ప్రాముఖ్యత ఉందని తన లేఖలో వివరించారు. అమరావతి.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉందని అన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డు ప్రదేశాన్ని తాము రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశామని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు 33 వేల ఎకరాలను త్యాగం చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనాలోచితంగా ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం వల్ల అమరావతి ప్రాంత రైతులు నష్టపోతారని, వారి త్యాగం వృధా అవుతుందని అన్నారు.
మోడీ సమక్షంలో..
అమరావతి నిర్మాణానికి.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఢిల్లీ కంటే మెరుగైన నగరాన్ని నిర్మిస్తామని ఆయన భరోసా ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని స్మార్ట్ సిటీగా గుర్తించిందని చెప్పారు. సచివాలయం, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నారు. దీనికి అదనంగా కేంద్రం 700 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని, ఇప్పుడు అవన్నీ వృధా అవుతాయని అన్నారు.
హైకోర్టుకు అనువైన ప్రదేశం..
హైకోర్టు ఏర్పాటు చేయడానికి అమరావతి మాత్రమే అనువైన ప్రదేశమని దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం గుర్తించిందని చంద్రబాబు అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో కూడా ఈ విషయాన్ని గుర్తించిందని చెప్పారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 10,000 కోట్లు వ్యయం చేసిందని అన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని వివరించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటైన నగరంగా పకడ్బందీగా డిజైన్ చేశామని అన్నారు.
Recommended Video
అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేలా..
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయ కక్షల కోసమే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తీసుకువచ్చిందని అన్నారు. ఈ బిల్లులను శాసన మండలి తిరస్కరించలేదని, సెలెక్ట్ కమిటీకి పంపించిందని చెప్పారు. బిల్లులను కౌన్సిల్లో రెండవసారి ప్రవేశపెట్టినప్పుడు, సెలెక్ట్ కమిటీల వద్ద పెండింగ్లో ఉన్నందున శాసన మండలి రెండవసారి బిల్లులను పరిగణించలేదని అన్నారు. ప్రస్తుత రాజధానిని ముక్కలు చేయడం లేదా తరలించడం గురించిన అంశాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు, శాసనసభ నిబంధనల ప్రకారం ఈ బిల్లులను చర్చించడం లేదా ఆమోదించడం కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.