మీరైతే కచ్చితంగా గెలుస్తారని చెబుతున్న చంద్రబాబు.. సీటు రిజర్వు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట.
ఉమ్మడి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయింది. ఆంధ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణలోనే అధికారంలోకి రాలేకపోతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా కేంద్రంగా పూర్తిగా బలహీనపడింది. ఏపీలో కూడా అంతకు మించిన పరిస్థితేమీ లేదు. తాజాగా గిడుగు రుద్రరాజును అధ్యక్షుడిగా నియమించిన తర్వాత పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.

కంచుకోటపై దృష్టిసారించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కుప్పంలో ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీకి చెక్ పెట్టేలా చంద్రబాబు రాయలసీమలో మెజారిటీ సీట్లను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి హిందూపురం, ఉరవకొండ శాసనసభా స్థానాల్లోనే విజయం సాధించగలిగింది. టీడీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా బలహీనమయ్యేసరికి చంద్రబాబు ఈ జిల్లాపై దృష్టి పెట్టారు. ఏ నియోజకవర్గానికి టికెట్ కేటాయించాలన్నా తాను చేయించుకున్న సర్వేను పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే చంద్రబాబు ఇన్ ఛార్జిని నియమిస్తున్నారు.

అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్న గ్రూపులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే పార్టీలో ఉన్న గ్రూపులు అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. గత ఎన్నికల్లో జేసీ సోదరుల వర్గానికి చెందిన బండారు శ్రావణిని పోటీకి దింపారు. జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. ముఖ్యమంత్రి జగన్ చేయించుకున్న సర్వేలో టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఒకరుగా జొన్నలగడ్డ పద్మావతి నిలిచారు. ఈసారి ఎన్నికలకు పద్మావతిని ఢీకొట్టడానికి శ్రావణి సరిపోదని చంద్రబాబు అంచనా వేస్తున్నారు.

శైలజానాథ్ అయితే సరైన అభ్యర్థి
పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సాకే శైలజానాథ్ ను టీడీపీలోకి తెచ్చి ఇక్కడి నుంచి పోటీకి దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. సాకే అయితే కచ్చితంగా గెలుస్తారని బాబు అంచనా వేస్తున్నారు. పది సంవత్సరాల నుంచి ఎటువంటి రాజకీయ జీవితం లేకపోవడం, భవిష్యత్తు కూడా అయోమయంగా ఉండటంతో శైలజానాథ్ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శైలజానాథ్ అందరినీ కలుపుకు వెళతారని, జేసీ వర్గానికి కూడా అనుకూలుడు కావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆలోచించి ఆయన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రేపో, మాపో అధికారికంగా ఆయన టీడీపీలో చేరడమే మిగిలింది.












Click it and Unblock the Notifications