ఇదీ నిజం, అమిత్ షా ఇదిగో లెక్క: బీజేపీకి కౌంటర్, అందరికీ పంచుతున్న టీడీపీ
అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అమిత్ చెప్పిన లెక్కలు తప్పు అంటూ లెక్కలతో సహా విడుదల చేసింది. 'అమిత్ షా ఆరోపణలు - అవాస్తవాలు' పేరిట విడుదల చేశారు.
'మోడీ గ్రాఫ్ తగ్గిందనే, జగన్ లైన్లోకి చంద్రబాబు, ఆ రోజు వైసీపీ ఎంపీల రాజీనామా'
దీనిని పార్టీలోని వారందరికీ పంచుతోంది. ఇందులోని అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించింది. రాజధాని అమరావతికి రూ.2500 కోట్లు ఇచ్చినట్లు, అలాగే 8 శాతం ఖర్చు చేశారని అమిత్ షా చెప్పారని, కానీ విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికిచ్చిన రూ.1000 కోట్లతో చేపట్టిన వాటిల్లో ఇప్పటికే 42 శాతం పనులు పూర్తయ్యాయిని, మిగతా వాటిని కూడా గడువులోగా పూర్తి చేస్తామని, రాజధానికి రూ.1500 కోట్లే ఇచ్చారని, ఆ మొత్తంతో 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు నిర్మించామని, 80 లక్షల చదరపు అడుగుల్లో అధికారుల, సిబ్బంది, ఎమ్మెల్యేల నివాస సముదాయాలను నిర్మిస్తున్నామని, కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు.
వాటిని వెనక్కి తీసుకున్నారు
వెనుకబడిన ప్రాంతాలకు, అమరావతికి ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టలేదని, 12 శాతమే వినియోగ పత్రాలు ఇచ్చారని అమిత్ షా చెప్పారని, కానీ ఏడు జిల్లాలకు రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని, అందులో 92 శాతం ఖర్చు చేశామని, 12 శాతం ఖర్చు చేశామని చెప్పడం సరికాదన్నారు. నాలుగో విడతలో రూ.350 కోట్లు విడుదల చేసి వాటిని వెనక్కి తీసుకున్నారన్నారు. విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు అన్నారని అమిత్ షా చెప్పారని, కానీ ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తోందని టీడీపీ చెప్పింది.
కాగ్ నిర్ధారించింది
కేంద్రం ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని అమిత్ షా చెప్పారని, ఇలా 29 రాష్ట్రాలకూ ఇస్తున్నారని, తమకు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదన్నారు.
2014-15 సంవత్సరం రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.3,970 కోట్లు విడుదల చేసిందని, 2015-16 సంవత్సరానికి మరో రూ.1,600 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని, 2014-15 సంవత్సరం లోటులో రైతు రుణమాఫీ, పింఛన్లు వ్యయాన్ని చేర్చి రూ.16,000 కోట్లు లోటుగా చూపడం సరైంది కాదని అమిత్ షా చెప్పారని, కానీ 2014-15లో రెవెన్యూ లోటు రూ.16,000 కోట్లు ఉందని కాగ్ నిర్ధారించిందని టీడీపీ చెప్పింది.
కాగితాలకే పరిమితం
విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి రూ.8991.38 కోట్ల మేరకు సంతకాలు జరిగాయని అమిత్ షా చెప్పారని, కానీ 2016 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకూ ఒక్క రూపాయీ విడుదల కాలేదని టీడీపీ చెప్పింది. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా, టీడీపీ కేంద్రమంత్రులిద్దరూ ఎంత ప్రయత్నించినా నియమాలు రూపొందించలేదని, అందుకే ఆ సంతకాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు.
ఇలా అయితే 30 ఏళ్లు పడుతుంది
పోలవరానికి ఇప్పటి వరకూ కేంద్రం రూ.5364 కోట్లు ఇచ్చిందని అమిత్ షా చెప్పారని, కానీ పోలవరంపై రాష్ట్రం ఇప్పటి వరకూ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
విద్యా సంస్థల విషయానికి వస్తే 2022 నాటికి 11 జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉండగా 9 విద్యాసంస్థలు ఇప్పటికే ఏర్పాటు చేశామని అమిత్ షా చెప్పారని, కానీ జాతీయ విద్యాసంస్థలకు రూ.11,762 కోట్లు అవసరమైతే నాలుగేళ్లలో రూ.576 కోట్లు ఇచ్చారని, దామాషా ప్రకారం చూసినా రూ.4 వేల కోట్లు ఇవ్వాలని, ఇలా అయితే నిర్మాణాలు పూర్తికావడానికి 30 ఏళ్లు పైగా పడుతుందన్నారు.