పార్లమెంట్ ఓపెనింగ్ కు హాజరుపై టీడీపీ మల్లగుల్లాలు ! విపక్షాలకు సాయిరెడ్డి చురకలు !
ఈ నెల 28న దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా నిర్వహించాలని విపక్షాలు చేసిన డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదు. ప్రధాని చేతుల మీదుగా పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేసింది. కనీసం ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
అయితే విపక్షాలు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నా ఎన్డీయేకు అనధికారిక మిత్రపక్షాలుగా ఉన్న వైసీపీ, బీజేడీ మాత్రం వెళ్లాలని నిర్ణయించాయి. దీంతో ఇప్పుడు ఏపీలో విపక్షం టీడీపీ ఇరుకునపడింది. టీడీపీకి లోక్ సభ, రాజ్యసభలో కలిపి నలుగురు ఎంపీలున్నారు. వీరు కేంద్రం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ టీడీపీ మాత్రం దీనిపై ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు.

టీడీపీ పార్లమెంట్ ప్రారంభానికి వెళ్లాలా వద్దా అన్న దానిపై మల్ల గుల్లాలు పడుతోంది. దీనికి ప్రధాన కారణం తాజాగా జరిగిన కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయమే. ఈ ఏడాది జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటే తాము ఎన్డీయే వైపు మొగ్గి సమస్యలు కొనితెచ్చుకోవడం ఎందుకున్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది.

మరోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కాని విపక్ష పార్టీలను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. నిన్న సీఎం జగన్ కూడా ఇదే అంశంపై విపక్షాలను రమ్మని కోరుతూ ట్వీట్ చేశారు. ఇవాళ సాయిరెడ్డి చేసిన ట్వీట్ లో పార్లమెంట్ ఏ ఒక్కపార్టీది, సిద్ధాంతానిదీ కాదన్నారు. ఇది భారత ప్రజలతో, ప్రజల వల్ల, ప్రజలు తయారు చేసుకున్న వ్యవస్ధగా అభివర్ణించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి పార్లమెంటులో ఐదో అతిపెద్ద ఎంపీలున్న పార్టీగా వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరవుతుందని సాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications