ఉత్తరాంధ్ర టీడీపీలో వరుస వికెట్లు: మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రాజీనామా: వైసీపీలోకి ఎంట్రీ?
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడింది. వలసల బెడదను ఎదుర్కొంటోంది. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీలో చేరడం, పులివెందులకు చెందిన సీనియర్ నాయకుడు ఎస్వీ సతీష్ రెడ్డి పార్టీకి గుడ్బై చెప్పిన 24 గంటలు కూడా గడవక ముందే.. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పార్టీని వీడారు. టీడీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు.

రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటన..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే కారణంతో విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా ప్రకటించారని, దాన్ని వ్యతిరేకించడం సరి కాదని అన్నారు. అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయమని డిమాండ్ చేయడం తప్పు కాదని, అదే సమయంలో విశాఖను పరిపాలన రాజధానిగా వ్యతిరేకించడానికి కారణమే లేదని చెప్పారు.

నారా లోకేష్ వల్ల ముఠా సంస్కృతి..
జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ వల్ల పార్టీలో ముఠా సంస్కృతి ఏర్పడిందని పంచకర్ల రమేష్బాబు విమర్శించారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడాన్ని స్వాగతిస్తోన్న సీనియర్ నాయకులను లెక్క చేయట్లేదని ఆరోపించారు. విశాఖపట్నం రాజధానిగా స్వాగతిస్తోన్న ఉత్తరాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. తమలో తమకే గొడవలు పెట్టేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

విశాఖను వ్యతిరేకించడానికి ఒక్క కారణమైనా లేదు..
ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడిన ప్రాంతమో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వందలాది మంది ఉపాధి కోసం వలసలు వెళ్తుంటారని అన్నారు. ఈ విషయం టీడీపీ నాయకత్వానికి తెలియనిది కాదని అన్నారు. అలాంటి ప్రాంతాంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడాన్ని పార్టీ నాయకులు స్వాగతించి ఉండాల్సిందని పంచకర్ల చెప్పారు. విశాఖపట్నాన్ని ఇంత బలంగా ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందనడానికి చంద్రబాబు గానీ, నారా లోకేష్ గానీ ఒక్క కారణాన్ని కూడా చూపించలేకపోయారని చెప్పారు.
Recommended Video


వైసీపీలో చేరే ఛాన్స్..
ఈ పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్బాబు ఇక అధికార పార్టీలోకి చేరడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన నిర్ణయాన్ని ఆయన త్వరలోనే వెల్లడిస్తారని చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, జనసేనకు చెందిన సీనియర్ నాయకుడు చింతలపూడి వెంకట్రామయ్య బాటలోనే పంచకర్ల కూడా వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రేపో, మాపో ఆయన వైఎస్ జగన్ను కలుసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications