జైపాల్ శుంఠపై టిడిపి ఆగ్రహం, ఏదని జగన్ సాక్షికి ప్రశ్న
మెట్రో తన వల్లే వచ్చిందని జైపాల్ చెప్పడం విడ్డూరమన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇది రూపుదిద్దుకుందని, ఆ తర్వాత ఆగిపోయిందని, బాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఎప్పుడో అయిపోయి ఉండేదన్నారు. జైపాల్ వ్యాఖ్యలను తాము అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు. సీమాంధ్రలో మేథావులు లేరని అప్పుడు కెసిఆర్, శుంఠలని ఇప్పుడు జైపాల్ అనడం సరికాదన్నారు. విడిపోకముందే ఇలా మాట్లాడితే తర్వాత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
ఆయన కేంద్రమంత్రిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఆయన మాటలు అహంకారంతో కూడిన ఆవేశపూరిత మాటలన్నారు. జైపాల్ శుంఠ వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో ఏవన్నారు. జగన్ సమైక్యవాదం ముసుగులో సోనియావాదం, విభజన వాదం వినిపిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఉత్తర కుమారుడిలా పారిపోయారన్నారు.
సోనియా, జగన్, కెసిఆర్ అజెండా రాష్ట్ర విభజన అన్నారు. అందులో భాగంగానే జగన్ నిన్నటి వరకు సభలో వాకౌట్, సస్పెండ్ డ్రామాలు ఆడారని, రేపు 17న మరో డ్రామా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీమాంధ్ర ప్రజలు జగన్ డ్రామాలను గుర్తించాలన్నారు. ఢిల్లీ ఆదేశాల మేరకే జగన్ సమైక్యవాదమని, అది పైకి మాత్రమే అన్నారు. తాము సమైక్యం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే అన్నారు.
రాజీవ్ గాంధీని ఉరి తీయాలన్న వ్యక్తి జైపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్రులను శుంఠలు అన్నందుకు ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తి పడి జైపాల్ తెలుగువారి గొంతు కోస్తున్నాడని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజల్ని తెలంగాణ నేతలు కించపర్చినా తాము అక్కడి ప్రజలను గౌరవిస్తామన్నారు. జైపాల్ తన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు.