అభిమానించడంలో ఓ మెట్టు పైకెక్కిన పవన్
Pawan Kalyan: నేడు- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. 1982 మార్చి 29వ తేదీన పురుడుపోసుకుందీ పార్టీ. 42 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఆవిర్భవించింది.
43 సంవత్సరాల కిందట ఇదే రోజున ఎన్టీ రామారావు ఈ పార్టీని స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే తిరుగులేని ఆధిక్యతతో ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగారు. తన ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది టీడీపీ. ఎత్తుపళ్లాలను చవి చూసింది. దిగ్విజయాలు, ఘోర పరాజయాలనూ అందుకుంది.

పలు సంక్షోభాలను అవలీలగా అధిగమిస్తూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ బ్రాండ్ను సృష్టించుకోగలిగింది. 2019 నాటి ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైనప్పటికీ- బౌన్స్ బ్యాక్ కాగలిగింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని 164 స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ చాణక్యానికి ఈ ఎన్నికలు అద్దం పట్టాయి. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం.. తెలుగుదేశం పార్టీనే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను అందుకోలేకపోయిన ఎన్డీఏ కూటమికి 16 లోక్సభ స్థానాలతో పట్టం దక్కేలా చేయగలిగింది.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు అభినందనలు తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. టీడీపీని ప్రజల గొంతుకగా అభివర్ణించారాయన. తన అభిమానాన్ని చాటుకున్నారు.
1982లో ఉమ్మడి ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు.
నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని, మరిన్ని విజయాను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications