కొమురవెల్లి మల్లన్న భక్తులకు రైల్వే తీపికబురు.. త్వరలో అందుబాటులోకి రైల్వేసేవలు!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే శాఖ అభివృద్ధి పనుల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని రైల్వే అవసరాలను తీర్చడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్త రైల్వే స్టేషన్ల ఏర్పాటు, రైల్వే లైన్ల ఏర్పాటు వంటి నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది.
కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ప్రారంభం ఈ నెలలోనే
కొమురవెల్లి లో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ప్రారంభించడానికి గత కొంతకాలంగా రైల్వే శాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కొమురవెల్లి లో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను ఈ నెల 26వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం జరిగిన నాటి నుండి భక్తులకు రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ప్రతీరోజు రెండు రైళ్ళు కొమురవెల్లి మార్గంలో
ప్రస్తుతం సిద్దిపేట సికింద్రాబాద్ మార్గంలో నడిచే రైళ్లు ఈ స్టేషన్ ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు రైళ్లు కొమురవెల్లి స్టేషన్ మీదుగా సికింద్రాబాద్ నుండి సిద్దిపేటకు వెళతాయి. ఆపై తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రెండు రైళ్లు అందుబాటులో ఉంటాయి.
రైల్వే శాఖలోని మూడు విభాగాల అధికారులతో ఒక ప్రత్యేక కమిటీ
ఇక భవిష్యత్తులో కొమురవెల్లి క్షేత్రానికి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుందో దానిని బట్టి రైళ్ళ సంఖ్యను పెంచడం కోసం, రైల్వే స్టేషన్లో వసతులను మెరుగుపరచడం కోసం రైల్వే శాఖలోని మూడు విభాగాల అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఉండడం, క్షేత్రస్థాయి పరిశీలనలు జరపడం ప్రధానంగా కనిపిస్తుంది.
కరీంనగర్, కాజీపేట మార్గాలకు భవిష్యత్ లో రైల్వే మార్గం అనుసంధానం
అయితే ప్రస్తుతం ఈ మార్గంలో ప్యాసింజర్ , డెమో రైలు నడుస్తుండగా భవిష్యత్తులో ఈ రైల్వే మార్గాన్ని కరీంనగర్, కాజీపేట మార్గాలకు అనుసంధానించనున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. ఈ నూతన రైల్వే లైన్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, జనగామ, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల భక్తులకు ఎంతో మేలు చేస్తుంది.
కొమురవెల్లి రైళ్ళతో సమయం, డబ్బు రెండూ ఆదా
ఇప్పటివరకు కొమురవెల్లి క్షేత్రానికి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులపైన ఆధారపడవలసి ఉండేది. కొమురవెల్లి జాతర సమయంలో, పండుగలు మరియు శ్రావణమాసం వంటి రద్దీ సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో భక్తులు సతమతమయ్యేవారు. కొమురవెల్లి కి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే ఆర్థిక భారం మరింత పెరిగేది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లి వెళ్లాలనుకునే వారికి సమయం ఆదా అవ్వడం మాత్రమే కాకుండా, డబ్బు కూడా ఆదా అవుతుంది.












Click it and Unblock the Notifications