నాని పోయే -రోజా వచ్చే : టార్గెట్ చంద్రబాబు - ఇక మొదలు : పవన్ ను ఓడించినా దక్కని పదవి..!!
ఏపీ కొత్త కేబినెట్ మరి కొద్ది గంటల్లో కొలువు తీరనుంది. కేబినెట్ ఎంపికలో ఈ సారి రోజా హాట్ టాపిక్ గా మారారు. పాత మంత్రులు పది మంది కొనసాగుతారనే ప్రచారంలో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ రోజు ఉదయం వరకూ నాని పేరు ఖాయమని చెబుతూ వచ్చారు. కానీ, చివరి నిమిషంలో కొడాలి నాని కేబినెట్ లిస్ట్ నుంచి తప్పించారు.
కొడాలి నాని స్థానంలో చివరి నిమిషంలో రోజాకు స్థానం కల్పించారు. అయితే, టీడీపీ లక్ష్యంగానే రోజాకు కేబినెట్ లో స్థానం కల్పించారనే చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లాలో 2019 లో పెద్దిరెడ్డి .. నారాయణ స్వామి మంత్రలుగా నియమితుల య్యారు. దీంతో..రోజాకు స్థానం దక్కలేదు. కానీ, ఇప్పుడు తిరిగి అదే ఇద్దరు ఉన్నా.. రోజాకు అవకాశం దక్కింది.
కొడాలిని తప్పించటంతో టీడీపీ హ్యాపీ
కేబినెట్ లో కొడాలి నానికి ఛాన్స్ మిస్ అవ్వటంతో రోజా ద్వారా టార్గెట్ చంద్రబాబు కొనసాగించాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ కేబినెట్ 2024 లక్ష్యంగా ఏర్పాటు చేసినది కావటంతో..రోజాకు ప్రభుత్వంలోనూ..సొంత జిల్లాలోనూ టార్గెట్ చంద్రబాబు లక్ష్యంగా పని చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
రోజా సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసారు. ఎమ్మెల్యేగానూ అవకాశం దక్కలేదు. 2014లో తొలి సారి ఎమ్మెల్యే అయిన తరువాత టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో టీడీపీ మంత్రులకు రోజా లక్ష్యంగా మారారు. శాసనసభ నుంచి ఏకంగా ఏడాది పాటు రోజా టీడీపీ హయాంలో సస్పెండ్ అయ్యారు. ఇక, ఇప్పుడు అదే శాసనసభలో రోజా మంత్రిగా అడుగు పెట్టనున్నారు. కానీ, చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేదు.
నాని స్థానంలో ఇక రోజా మొదలు
కానీ, ఈ సారి కుప్పం నియోజకవర్గం పైన సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే అక్కడ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ప్రచారం సాగుతోంది. యితే, ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమని భావించారు.
కానీ, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పశ్చిమ గోదావరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను కేబినెట్ లోకి తీసుకున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడే మంత్రులు పేర్ని నాని.. కన్నబాబుకు సైతం మంత్రి పదవులు రెన్యువల్ కాలేదు. కన్నబాబు స్థానంలో ఆ జిల్లా నుంచి దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి దక్కింది.
జగన్ నయా సమీకరణాలతో..
క్రిష్ణా జిల్లాలో జోగి రమేష్ కు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఇదే జిల్లాలో పార్ధసారధికి దక్కుతుందని భావించినా.. యాదవ సామాజికవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావుకు కేటాయించారు. అయితే, క్రిష్ణా జిల్లా నుంచి కాపు - కమ్మ వర్గాలకు మంత్రి పదవి ఇవ్వకపోవటం ద్వారా కొత్త రాజకీయ సమీకరణానికి జగన్ తెర తీసారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా ముగ్గురికి అవకాశం దక్కింది. అందులో క్రిష్ణా జిల్లాలో కాపు వర్గానికి అవకాశం ఇవ్వలేకపోవటంతో..గుంటూరు జిల్లా నుంచి ఆ వర్గానికి చెందిన అంబటికి స్థానం దక్కింది. టీడీపీకి ప్రధానంగా అండగా నిలిచే వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవటం ద్వారా జగన్ కొత్త సంకేతాలు పంపినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో..ఈ సామాజిక వర్గాల కేటాయింపులు.. జిల్లాల వారీగా నిర్ణయాలు ఎటువంటి ప్రభావం చూపుతాయనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.