టీకి బ్రేకులు: కిరణ్పై అవిశ్వాసానికి టిడిపి ఐడియా
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశాలపై సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోయే అవకాశాలుంటే ఆ పనిచేయాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ఎలా ఉంటుందనే విషయంపై టిడిపి ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంపై శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఇది వరకే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చెవిన వేసినట్లు చెబుతున్నారు. అయితే, అలా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఎదురయ్యే పరిస్తితులు ఏమిటనే విషయంపై ఆయన ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుల నుంచే వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని సీమాంధ్ర టిడిపి శాసనసభ్యులు పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. దానివల్ల రాష్ట్ర విభజన సమస్యలపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అది శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం చర్చకు రావడానికి 30 మంది శానససభ్యుల బలం అవసరం. ఆ బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే, రాజకీయంగా అది ఏ మేరకు తమకు ఉపకరిస్తుందనే అంశంపైనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడమా, వద్దా అనే అంశంపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications